నివర్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా: పోటెత్తుతోన్న సముద్రం: తీరం దాటేటప్పుడు ప్రళయమే?
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు, పుదుచ్చేరి అల్లకల్లోలంగా తయారయ్యాయి. సముద్ర తీరం పోటెత్తుతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాజధాని చెన్నై, కాంచీపురం సహా అనేక జిల్లాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నివర్ తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ.. అది మరింత ఉగ్రరూపాన్ని దాల్చుతోంది. పెను తుఫాన్గా రూపాంతంరం చెందింది. తీరం దాటే సమయంలో విలయాన్ని సృష్టించక తప్పదని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
గంటకు ఆరు కిలోమీటర్ల గమనం..
బంగాళాఖాతం ఆగ్నేయదిశగా ఏర్పడిన నివర్ తుఫాన్.. క్రమంగా పశ్చిమం, వాయవ్య దిశగా కదులుతోంది. దాని గమనం గంటకు ఆరు కిలోమీటర్లుగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తమిళనాడులోని కడలూర్కు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందా పెను తుఫాన్. క్రమంగా మరింత బలపడుతోంది. తీరాన్ని సమీపించే సమయానికి మరింత ఉధృతంగా మారే అవకాశాలు లేకపోలేదు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 145 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అభిప్రాయపడుతున్నారు.
చెన్నైలో రికార్డు స్థాయి వర్షపాతం..
నివర్ ప్రభావంతొ చెన్నైలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి 8:30 గంటల నుంచి బుదవారం తెల్లవారు జామున 5:30 గంటల వరకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సగటున 120 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు చెన్నై వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నుంగంబాక్కంలో 145, మీనంబాక్కంలో 108, తారామణిలో 101 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కాంచీపురం, కాళ్లకురిచ్చిల్లో సహా ఇతర జిల్లాల్లో ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.
పుదుచ్చేరిలో ఇదే పరిస్థితి..
పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తీరంలో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. సముద్రం పోటెత్తుతోంది. ఉగ్రరూపాన్ని దాల్చింది. అలలు ఎగిసిపడుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో కంటే అధిక ఎత్తులో అలలు తీరం వైపు దూసుకొస్తున్నాయి. భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడు కావడంతో సముద్రం అల్లకల్లోలాంగా మారింది. చెన్నై శివార్లలోని మామళ్లాపురం-కారైక్కల్ మధ్య తుఫాన్ ఈ సాయంత్రానికి తీరాన్ని దాటే అవకాశం ఉంది.
Recommended Video
రెడ్ అలర్ట్ జారీ..
నివార్ ప్రభావం వల్ల తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి- తీర ప్రాంతా జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. అరియలూరు, మ్యాదుతురై, తంజావూరు, తిరువరూరు, నాగపట్టిణం, కడలూర్, విల్లుపురం, తిరువణ్ణామలై, కాళ్లకురిచ్చి, పెరంబలూర్ల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాలు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్టుతో పాటు తీరానికి దూరంగా ఉన్న వేలూరు, ధర్మపురి, తిరుపత్తూర్, కృష్ణగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ఇచ్చారు.