కుప్పంలో చంద్రబాబుకు బిగ్ షాక్: అక్కడ టీడీపీ ఖాళీ: పెద్దిరెడ్డి స్కెచ్.. వర్కౌట్
చిత్తూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అంచనాలు తప్పట్లేదు. వారు వేసిన స్కెచ్ వర్కవుట్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గంలో పాగా వేయడానికి వైసీపీ నేతలు వేసిన వ్యూహాలు పక్కాగా ఫలిస్తోన్నట్టే కనిపిస్తోంది. ఎంత పకడ్బందీగా ఈ వ్యూహాలను రచించుకోగలిగారో.. అంతే పకడ్బందీగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. ఫలితంగా- తెలుగుదేశం పార్టీ కంచుకోట బీటలు వారేలా కనిపిస్తోంది.

మరోసారి వలసలు..
వందమందికిపైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి గుడ్బై చెప్పారు. వైఎస్సార్సీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి సమక్షంలో వారు అధికార పార్టీలో చేరారు. తిరుపతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారంతా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ కండువాలను కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీకి గుడ్బై చెప్పిన వారంతా కుప్పం కుప్పం నియోజకవర్గం పరిధిలోని గుడిపల్లి మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు. నియోజకవర్గంలో బలమైన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు.

మరిన్ని చేరికలు..
మున్ముందు కుప్పం టీడీపీ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో టీడీపీ ఖాళీ అవుతుందని, 2024 ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఈ సారి ఓటమి తప్పదని పేర్కొన్నారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చూసి, ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.

టీడీపీకి కంచుకోటగా..
ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తోన్నారు కుప్పం ఓటర్లు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా ఓటమి చవి చూడని అసెంబ్లీ స్థానాల్లో ఇదీ ఒకటి. టీడీపీ అభ్యర్థిగా 1989లో తొలిసారిగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేశారు. ఇప్పటిదాకా వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చివేశారు. మరో పార్టీ ఇక్కడ పాగా వేయాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితిని కల్పించారు.

మసకబారుతోన్న ఛరిష్మా..
అలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ఛరిష్మా మసకబారింది. టీడీపీ కోటకు బీటలు ఏర్పడ్డాయి. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి టీడీపీ బలహీనడిందనేది మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేశాయి. పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ స్థాయిలో ఏ ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించలేదు సరికదా.. గట్టీ పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది.












Click it and Unblock the Notifications