చంద్రబాబు కఠిన నిర్ణయం - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా..!!
చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పర్యటన.. తెలుగుదేశం పార్టీలో పుట్టించిన ప్రకంపనలు ఇంకా తగ్గనట్టే కనిపిస్తోంది. దశాబ్దాలుగా చంద్రబాబు, టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఈ నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిన తరువాత అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. దీని ఫలితం ఎలా ఉండబోతోందనేది స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే రుజువు చేశాయి కూడా.

సభ సక్సెస్..
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత వైఎస్ జగన్ తొలిసారిగా చంద్రబాబు గడ్డపై అడుగు పెట్టడం, వైఎస్సార్ చేయూత పథకం కింద ఏకంగా 4,949.44 కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయడం- జోష్ నింపింది. 66 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేశారు. పలు వరాలను ప్రకటించారు. ఇది కొంతమేర టీడీపీ ఓటుబ్యాంకును ప్రభావితం చేస్తుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

డిఫెన్స్లో టీడీపీ..
కుప్పంపై జెండా పాతబోతోన్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెస్తోన్న ప్రకటనలు టీడీపీని ఆత్మరక్షణలో నెట్టేశాయి. మొన్నీ మధ్యే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక పథకం ప్రకారం కుప్పంలో గెలుస్తామనే ప్రకటనలు చేస్తోన్నారని, చంద్రబాబు నాయుడిని ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిగా దించడానికి పన్నుతున్న వలగా అభివర్ణించారు. ఈ ట్రాప్లో పడొద్దంటూ ఆయన పార్టీ నాయకులు, కుప్పం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు మరో సీటు..
కుప్పంలో వైఎస్ జగన్ సభ విజయవంతమైనట్టు గ్రౌండ్ రిపోర్ట్ అందడం.. పార్టీ నాయకులు దీనిపై గట్టిగా ఎదురుదాడికి దిగలేకపోవడం వంటి పరిణామాలు చంద్రబాబును పునరాలోచనలో పడేశాయని, దీనితో ఒకట్రెండు కఠిన నిర్ణయాలను తీసుకోవచ్చనీ చెబుతున్నారు. ఇక కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలోనూ పోటీ చేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదనలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోన్నాయి.

అనంతపురం జిల్లాపై..
తన రెండో నియోజకవర్గం కోసం చంద్రబాబు ఇదివరకే అన్వేషణ మొదలు పెట్టారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆయన పోటీ చేయొచ్చని తెలుస్తోంది. అనంతపురం జిల్లాపై తెలుగుదేశం పార్టీకి ముందు నుంచీ గట్టిపట్టు ఉంది. కళ్యాణదుర్గం నుంచి తాను, పొరుగునే ఉన్న హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీకి దిగితే- దాని ప్రభావం అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలపై ఉంటుందని, అభ్యర్థులను గెలిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

తొలిసారిగా..
సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం ఆనవాయితీ. 1989లో ఎన్టీ రామారావు కూడా కల్వకుర్తి, హిందూపురంలల్లో పోటీ చేశారు. కల్వకుర్తిలో ఎన్టీ రామారావు ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ విజయం సాధించారు. హిందూపురంలోనూ పోటీ చేసి, గెలవడం వల్ల అసెంబ్లీకి వెళ్లగలిగారు. 2019లో పవన్ కల్యాణ్ కూడా భీమవరం, గాజువాకల నుంచి అసెంబ్లీ బరిలో దిగారు.

రెండో సీటుకు వెళ్లని చంద్రబాబు..
చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు రెండో నియోజకవర్గం జోలికి వెళ్లలేదు. కుప్పం గెలుపుపై ఆయనకు అంత ఆత్మవిశ్వాసం ఉండేది. 1989 నుంచీ ఆయన కుప్పం నుంచి గెలుస్తూనే వస్తోన్నారు. ఇప్పుడు తాజాగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో- చంద్రబాబు పునరాలోచనలో పడినట్టే కనిపిస్తోంది. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయ్యాల్సి వస్తే- చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో తొలిసారి అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టవుతుంది.












Click it and Unblock the Notifications