నగరిలో తొలి ఆహా క్యాంటీన్- ప్రారంభించిన మంత్రి రోజా
చిత్తూరు: ఏపీ ప్రభుత్వం కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా ఆహా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. మెప్మా కింద ఇవి దశలవారీగా ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 110 మున్సిపాలిటీల్లో 140 ఆహా పేరుతో ఈ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రభుత్వం. దీని నిర్వహణ కోసం స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వం 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రివేళల్లో నామమాత్రపు ధరకు భోజనం లభిస్తుంది ఈ క్యాంటీన్లో. పులిహోర, ఫ్రైడ్ రైస్, పెరుగున్నం, వడ.. ఇందులో అందుబాటులో ఉంటాయి. పాకెట్ల రూపంలో కొనుగోలుదారులకు సరఫరా చేస్తారు. ఒక్కో పాకెట్ ధర 10 రూపాయలు. స్వయం సహాయక సంఘాలు, మెప్మా కింద వాటిని నిర్వహిస్తోండటం వల్ల ఆదాయం వారికే అందుతుంది.

చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటయిన తొలి ఆహా క్యాంటీన్ను పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ప్రారంభించారు. అక్కడే భోజనం రుచి చూశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. 10 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం వీటిని నెలకొల్పిందని, అర్బన్ మార్ట్ ద్వారా స్వయం సహాయక బృందాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోన్నామని చెప్పారు.
మహిళల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తోన్నారని రోజా చెప్పారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా కానుక, విద్యా దీవెన.. వంటి పథకాల లబ్దిని మహిళలు పొందుతున్నారని అన్నారు. మహిళల పేు మీద ఇళ్లను సైతం ప్రభుత్వం నిర్మించి ఇస్తోందని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటి నాయకులు దీన్ని భరించలేకపోతున్నారని, అందుకే వైఎస్ జగన్, మంత్రులు, ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తోన్నారని విమర్శించారు. తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మహిళలకు నామాలు పెట్టాడని, 2016 నుంచి సున్నావడ్డీ కింద 3,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయలేదని అన్నారు. పవన్ కల్యాణ్ ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications