నేటి మంత్రులకూ అచ్చెన్న గతే: పార్టీ మార్పుపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు క్లారిటీ
అమరావతి: వరుసగా తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతుండటంతో ఇంకెంత మంది పార్టీ మారతారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్ టీడీపీ నేతలు కూడా వైసీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు టీడీపీ నేతలు కూడా అధికార పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది.

పార్టీ మారడం లేదు..
ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే తాము పార్టీ మారడం లేదంటూ క్లారిటీ ఇచ్చుకున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా మీడియా ముందుకు వచ్చారు. తాను పార్టీ మారడం లేదంటూ స్పష్టతనిచ్చారు.

కావాలనే దుష్ప్రచారం..
కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై కూడా పత్తిపాటి స్పందించారు. గత ఏడాది ఇచ్చిన హామీలను నెరవేర్చితేనే అధికార పార్టీకి ప్రజల్లో గౌరవం ఉంటుందన్నారు.

నేటి మంత్రులకూ అదే గతి..
ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నాయుడి అరెస్ట్ తీరు ఎంతో అమానుషమని పత్తిపాటి మండిపడ్డారు. ప్రభుత్వానికి వంతపాడుతున్న నేటి మంత్రులకు కూడా అచ్చెన్నాయుడి పరిస్థితి రావచ్చంటూ హెచ్చరించారు .
మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పపై కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను బెదిరించి లొంగదీసుకుంటున్నారని ఆరోపించిన పత్తిపాటి.. అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలు బయటకు పోకుండా చూసుకోవాలన్నారు.
Recommended Video

అధికార పార్టీపై టీడీపీ మండిపాటు
ఇటీవల మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు టీడీపీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. వరుసగా నేతలు టీడీపీ వీడుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికార వైసీపీ బెదిరింపులకు గురి చేస్తూ తమ పార్టీ నేతలను లోబర్చుకుంటోందని ఆరోపించారు. వైసీపీ బెదిరింపులకు భయపడే కొందరు నేతలు టీడీపీని వీడుతున్నారని అన్నారు. అయితే, కొందరు పార్టీని వీడినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications