టీడీపీలో ధూలిపాళ్ల నరేంద్రపై అనుమానపు చూపులు..?
అమరావతి: తెలుగుదేశం పార్టీ మరోసారి భారీ కుదుపునకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చేసిన రాజీనామాకు సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గకముందే- మరో రెండు షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలు ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ చౌదరి, బోడె ప్రసాద్ పార్టీని వీడొచ్చనే ప్రచారం సాగుతోంది. ధూలిపాళ్ల నరేంద్ర, బోడె ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

లోకేష్ టూర్ కు డుమ్మా కొట్టినప్పుడే..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ కొద్దిరోజుల కిందట గుంటూరు జిల్లాలోని పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే. భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా..ఆయన కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు. ఈ పర్యటనకు ధూలిపాళ్ల డుమ్మా కొట్టారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి అయిదు దఫాలుగా అసెంబ్లీకి ఎన్నికైన ధూలిపాళ్ల.. పార్టీ ప్రధాన కార్యదర్శి పర్యటనకు గైర్హాజర్ కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అయ్యప్ప మాల ధారణ చేసినందుకే..
నారా లోకేష్ పర్యటన సమయంలో ధూలిపాళ్ల అయ్యప్ప మాల ధారణలో ఉన్నారని, అందుకే ఆయన పాల్గొనలేకపోయారని చెబుతున్నారు జిల్లా టీడీపీ నాయకులు. అయ్యప్ప మాలను ధరించిన సమయంలో మరణించిన వారి ఇంటికి వెళ్లడం సరికాదనే ఉద్దేశంతోనే ఆయన నారా లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారని అంటున్నారు. అయినప్పటికీ.. ఆ పర్యటన మొత్తంలో ఎక్కడ కూడా ధూలిపాళ్ల నరేంద్ర కనిపించలేదు. కనీసం ఆయన ప్రస్తావన కూడా ఎక్కడా తీసుకుని రాలేదు టీడీపీ నాయకులు.

పార్టీ కార్యకలాపాలకూ దూరంగా ఉంటూ..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ధూలిపాళ్ల తొలిసారిగా ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి చవి చూడటం ఇదే తొలిసారి. అయిదు దఫాలుగా అప్రతిహతంగా ధూలిపాళ్ల కొనసాగించిన జైత్రయాత్రకు మొన్నటి ఎన్నికలు బ్రేక్ వేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య చేతిలో ధూలిపాళ్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

టీడీపీకి డైహార్డ్ ఫ్యాన్ గా..
తెలుగుదేశానికి డైహార్డ్ ఫ్యాన్ గా ఉంటూ వస్తోన్న ధూలిపాళ్ల పార్టీని వీడతారనడంపై భిన్నాభిప్రాయాలు సైతం వ్యక్తమౌతున్నాయి. ఒక్క ఓటమితో ఆయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోబోరని టీడీపీకి చెందిన ఒక వర్గం నాయకులు స్పష్టం చేస్తున్నారు. పార్టీని వీడతారంటూ ఇదివరకే వచ్చిన వార్తలకు ధూలిపాళ్ల తోసిపుచ్చకపోవడం అనుమానాలకు కారణమౌతుందనే వారూ టీడీపీలో చాలామందే ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, ఒకట్రెండు సందర్భాల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఫోన్లకు స్పందించకపోవడ.. దీనికి ఉదాహరణగా చూపుతున్నారు.
Recommended Video

నాటి ఛలో ఆత్మకూరు నుంచి ఇసుక దీక్ష వరకూ..
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ధూలిపాళ్ల పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా లేరనే విషయాన్ని ఆయన అనుచరులు సైతం ధృవీకరిస్తున్నారు. రెండు నెలల కిందట తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఛలో పల్నాడు ఆందోళనలో ధూలిపాళ్ల పాల్గొనలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని చెప్పుకొచ్చారు టీడీపీ నాయకులు. విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్షలో సైతం ఆయన కనిపించలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత నిర్వహించిన ఏ పార్టీ కార్యక్రమంలోనూ ఆయన పెద్దగా పాల్గొనలేదని స్పష్టమౌతోంది. ఆయా అంశాలను బేరీజు వేసుకుని చూస్తే ధూలిపాళ్ల.. పార్టీని వీడొచ్చనడానికి అధికావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications