మంత్రి ఈటలపై సంచలన ఆరోపణలు... 100 ఎకరాలు కబ్జా..? ఇలా వెలుగులోకి.. అసలేంటీ వివాదం?
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట,హకీంపేట గ్రామాల పరిధిలో ఉన్న 100 ఎకరాల భూమిని ఈటల రాజేందర్కు చెందిన జమున హ్యాచరిస్ యాజమాన్యం కబ్జా చేసినట్లుగా కొంతమంది రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమకు కేటాయించిన అసైన్డ్ భూములను జమున హ్యాచరిస్ నిర్వాహకులు బలవంతంగా లాక్కున్నారని... దానిపై ప్రశ్నిస్తే తమపై బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ అధినాయకత్వంపై ఈటల తిరుగుబాటు స్వరం వినిపిస్తున్న వేళ... ఈ కబ్జా వ్యవహారం తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
మంత్రి ఈటలపై రైతుల ఫిర్యాదు...
మంత్రి ఈటల రాజేందర్కు చెందిన జమున హ్యాచరిస్ తమ భూములను లాగేసుకుందని అచ్చంపేట,హకీంపేట గ్రామాలకు చెందిన చాకలి భూమయ్య,చాకలి బిచ్చవ్వ,చాకలి కృష్ణ,చాకలి నాగులు,ఎరుకల ఎల్లయ్య తదితరులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సర్వే నెంబర్లు 135/5,135/9,135/10,64/6లలో ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని బలవంతంగా లాక్కుని అందులో నిర్మాణాలు చేపట్టినట్లుగా వీరు ఆరోపిస్తున్నారు. అంతేకాదు,కబ్జా భూములకు ఆనుకుని ఉన్న అసైన్డ్ భూముల హక్కుదారులను కూడా జమున హ్యాచరిస్ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మీ భూములకు దారి ఇవ్వమని... ఎంతో కొంత డబ్బు తీసుకుని ఆ భూములను తమకు అప్పగించాలని బెదిరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెగ్యులరైజ్ చేయాలని ఈటల ఒత్తిడి...
మంత్రి ఈటలపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ స్పందించారు. సాధారణంగా అసైన్డ్ భూములను ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కుదరదన్నారు. ఒకవేళ ఆ అసైన్డ్ భూముల హక్కుదారులు వాటిని విక్రయించాలనుకుంటే... బలహీనవర్గాలకు చెందిన పేదలకే విక్రయించాల్సి ఉంటుందన్నారు. అంతే తప్ప కార్పోరేట్లకు,ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూమి ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవన్నారు. మాసాయిపేట మండలంలోని 100 ఎకరాల భూమిని తమకు రెగ్యులరైజ్ చేయాలని గతంలో ఈటల రాజేందర్ తమపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. అయితే ఈ విషయంలో తామేమీ చేయలేమని మంత్రితో చెప్పామన్నారు.
హక్కుదారులు వారే... : మంత్రి ఈటల
కబ్జాకి గురైన ఆ భూములు ఇప్పటికీ రైతుల పేర్ల మీదనే ఉన్నాయని అడిషనల్ కలెక్టర్ నగేశ్ తెలిపారు. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని సాగు చేసుకునేందుకు రైతులకు హక్కు ఉందన్నారు.మంత్రి ఈటలతో పాటు ఆయన అనుచరులు సూరి,యంజాల సుధాకర్ రెడ్డిలపై స్థానిక రైతులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,ఇతర ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Recommended Video
కొన్నాళ్లుగా ఈటల ధిక్కార స్వరం...
గత కొన్ని నెలలుగా మంత్రి ఈటల వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గులాబీ జెండాకు అసలైన ఓనర్లం తామేనని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. అలాగే పలుమార్లు పలు వేదికలపై ఆయన ప్రభుత్వాన్ని ధిక్కరించేలా చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీ వీడుతారేమోనన్న ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. అంతేకాదు,ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని... దాన్ని ఉద్దేశించే 'పార్టీ పెట్టడం పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు..' అని అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యానించారన్న ప్రచారం జరిగింది. అయితే మంత్రి ఈటల మాత్రం తనపై జరుగుతున్న ప్రచారం పట్ల మౌనమే వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోవిడ్ వైద్య సేవల పర్యవేక్షణలో తలమునకలవగా ఈ భూకబ్జా ఆరోపణలు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈటలను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైతే ఈ కబ్జా వ్యవహరంపై మంత్రి ఈటల గానీ,జమున హ్యాచరిస్ యాజమాన్యం గానీ నేరుగా స్పందించలేదు. ఇక ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.