సికింద్రాబాద్ గణపతి ఆలయంలో భక్తుడిపై పూజారి దాడి: వీడియో వైరల్
హైదరాబాద్: నగరంలోని ప్రముఖ సికింద్రాబాద్ గణపతి ఆలయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. దైవ దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడిపై అక్కడి ఓ పూజారి దాడి చేశారు. ఈ ఘటన ఆల్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో రోజుల క్రితం గణపతి ఆలయానికి వచ్చిన ఉప్పల్కు చెందిన భక్తుడు.. వినియాకుడిని దర్శించుకున్నాడు.
పక్కనే ఉన్న ఉప ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో.. అనుమతి లేకుండా ఆ గుడిలోకి ఎలా వెళ్తావంటూ.. పూజారి ప్రభాకర్ శర్మ వాగ్వాదానికి దిగాడు. అంతేగాక, ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన పూజారి.. ఏకంగా ఆ భక్తుడిపై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా నువ్వు ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించాడు.
కాగా, ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ క్రమంలో దాడి ఘటనపై భక్తుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆలయ అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రభాకర్ శర్మపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పోలీసులు కూడా ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, భక్తుడిపై పూజారి దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సదరు పూజారిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో భక్తులకు భద్రత లేకపోతే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుల పూజారులు దాడి చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దేవునికి పూజలు చేయాల్సిన పూజారులే ఇలా దౌర్జన్యం చేస్తే భక్తులకు భద్రత ఎక్కడ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.