సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి వైఎస్ జగన్ నివాళి - బాలకృష్ణతో ..!!
హైదరాబాద్: ప్రముఖ నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. కొద్దిసేపటి కిందటే ఆయన పద్మాలయా స్టూడియోస్కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట మంత్రి వేణుగోపాల కృష్ణ, జగ్గయ్యపేట శాసన సభ్యుడు సామినేని ఉదయభాను, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తదితరులు ఉన్నారు. కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావుతో కలిసి పార్థివ దేహానికి నివాళి అర్పించారు.
అనంతరం మహేష్ బాబును ఓదార్చారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆదిశేషగిరి రావు కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, పద్మావతి, మంజుల, ప్రియదర్శినిని పరిచయం చేశారు. వారిని జగన్ పలకరించారు. అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు లోక్సభ సభ్యుడు, కృష్ణ పెద్దల్లుడు గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్తో క్లుప్తంగా మాట్లాడారు.
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళి. మహేష్ బాబు, కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం. #RIPSuperstarKrishnagaru pic.twitter.com/u3s4jREhfY
— YSR Congress Party (@YSRCParty) November 16, 2022
ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ అక్కడే ఉన్నారు. మహేష్ బాబు పక్కనే నిల్చున్న బాలకృష్ణను వైఎస్ జగన్ పలకరించగా.. చిరునవ్వుతో బదులిచ్చారాయన. కాగా- ఈ ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు వైఎస్ జగన్. ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరి వచ్చారు. పద్మాలయా స్టూడియోస్కు చేరుకున్నారు. వైఎస్ జగన్ రావడంతో కొద్దిసేపు అభిమానులను బయటే నిలిపివేశారు పోలీసులు. కట్టుదిట్టమైన బందోబస్త్ చేశారు.
మంగళవారం తెల్లవారు జామున సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్ట్తో సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 4:09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.