బై బై గణేశా.. గంగమ్మ ఒడికి గణనాధులు.. నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
Recommended Video
హైదరాబాద్ : దారులన్నీ అటు వైపే. నవ రాత్రులు పూజలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్దమయ్యాడు. నిమజ్జన పర్వం తుది ఘట్టానికి చేరుకోవడంతో హైదరాబాద్ సందడిగా మారింది. గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే హుస్సేన్ సాగర్ వైపు గణనాధులు క్యూ కట్టారు. వినాయక శోభాయాత్రలతో భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ఖైరతాబాద్ పెద్ద గణేశుడి శోభాయాత్ర కూడా ఉదయమే ప్రారంభమైంది. కొన్ని చోట్ల లడ్డూ వేలం పాట ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
గంగమ్మ ఒడికి గణనాధులు.. బై బై గణేశా
నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. ఆ క్రమంలో హైదరాబాద్ నగరమంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. గణనాధుల శోభాయాత్రలతో భక్తులు పరవశించి పోతున్నారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ హుస్సేన్ సాగర్లో గణనాధులను నిమజ్జనం చేయడానికి తరలి వెళుతున్నారు. భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. గణేశుడి నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాయి.
కోలాహాలంగా గణేశ్ నిమజ్జనం
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం కోలాహాలంగా మారింది. వినాయక నవరాత్రులు మొదలు మూడో రోజు నుంచే నగరంలో నిమజ్జనం జరుగుతుంటుంది. అయితే చివరి ఘట్టం మాత్రం గురువారం నాటితో పూర్తి కానుంది. ఆ క్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు అలర్టయ్యారు. గణేశ్ నిమజ్జనం సవ్యంగా, సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
గణేశ్ నిమజ్జనం చివరి ఘట్టంలో భాగంగా హైదరాబాద్ అంతటా దాదాపు 391 కిలోమీటర్ల మేర నిమజ్జన పర్వం కొనసాగనుంది. ఆ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ శాఖ, జలమండలి, శానిటేషన్ తదితర ప్రభుత్వ విభాగాల సిబ్బంది వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక గణేశ్ యాక్షన్ టీమ్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. సందర్శకులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 04027852482 , 9490598985 ,9010203626 హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి సంపూర్ణ నిమజ్జనం
ఖైరతాబాద్ మహా గణపతిని ఈసారి కూడా తొలుత నిమజ్జనం చేయనున్నారు. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 6 దగ్గరకు ఖైరతాబాద్ పెద్ద గణేశుడు చేరుకోనున్నాడు. అనంతరం అన్నీ కార్యక్రమాలు ముగించి మధ్యాహ్నం ఒంటి గంట లోపే నిమజ్జనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి మహా గణపతిని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్లకు పైగా లోతు పెంచినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఆ మేరకు ఖైరతాబాద్ పెద్ద గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. 61 అడుగుల ఎత్తు 27 అడుగుల వెడల్పుతో 45 టన్నులకు పైగా బరువున్న మహా గణపతి విగ్రహాన్ని తరలించేందుకు సాంకేతిక సాయం తీసుకున్నారు.
చిన్నా, పెద్దా ఆడుతూ పాడుతూ.. నిమజ్జనంలో హుషారు
హైదరాబాద్ లో గణనాధుల శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి గణేశులు నిమజ్జనం కోసం ట్యాంక్బండ్ కు తరలివస్తున్నారు. నగర వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శోభాయాత్ర జరిగే మార్గాల్లో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది కార్మికులు పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. వినాయక శోభాయాత్రలతో భాగ్యనగరంలో సందడి వాతావరణం నెలకొంది. చిన్నా, పెద్దా ఉత్సాహంతో డ్యాన్సులు చేస్తూ గణేశ్ నిమజ్జనంలో పాల్గొంటున్నారు. డప్పు చప్పుళ్లు, డీజే హోరు మధ్య లంబోదరులు హుస్సేన్ సాగర్ వైపు క్యూ కడుతున్నారు.
ఆంక్షలు.. భద్రత కట్టుదిట్టం.. సాఫీగా సాగేలా చర్యలు
నగరమంతటా దాదాపు 32 ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించారు. అలాగే 27 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 21 వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ సిబ్బంది 2100 మంది నిమజ్జనంలో డ్యూటీ చేయనున్నారు. అలాగే 134 మొబైల్ క్రేన్లతో పాటు 93 స్టాటిక్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. అదలావుంటే 66 ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. నిమజ్జనం సందర్భంగా 550 స్పెషల్ బస్సులను నడపనుంది ఆర్టీసీ. అటు ఎంఎంటీస్ రైళ్లను కూడా 4,5 నిమిషాలకు ఒకటి నడుపుతున్నారు.