హైదరాబాద్లో ఉరుములు, మెరుపుల వాన.. భయానక శబ్ధాలతో జనాల్లో దడ దడ
హైదరాబాద్ : ఎండాకాలంలో వాన కురిసింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో అకాల వర్షం పడింది. నగరవాసులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించినా.. ఉరుములు, మెరుపులు భయపెట్టించాయి. బీభత్సమైన శబ్ధాలు దడ పుట్టించాయి. ఎల్బీనగర్, సనత్ నగర్, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు ఏరులై పారింది. అయితే ఆదివారం రాత్రి కావడంతో రోడ్లపై ఎక్కువ జనాలు లేకపోవడంతో ట్రాఫిక్ చిక్కులు తప్పినట్లైంది.
ఆదివారం నాడు పగలంతా ఎండ దంచికొట్టింది. రాత్రి సమయంలో ఆకస్మాత్తుగా వర్షం ప్రత్యక్షమైంది. పెద్ద పెద్ద శబ్ధాలతో ఉరుములు, మెరుపులు దడ పుట్టించినా.. కొద్ది సమయం తర్వాత నగరవాసులు సేదతీరారు. వర్షం కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చల్లగాలులు వీచాయి. దీంతో ఎండ వేడిమి నుంచి కాసింత రిలాక్స్ దొరికినట్లైంది.
రాష్ట్రమంతటా ఆదివారం నాటికి పగటి పూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. కొత్తగూడెం, రామగుండంలో గరిష్ఠంగా 43.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. దాంతో ఎండ వేడిమికి జనాలు అల్లాడిపోయారు. హైదరాబాద్ లో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం.. అందులో ఆదివారం సెలవు దినం కావడంతో.. చాలామటుకు ఇళ్లల్లోనే ఉండిపోయారు. రాత్రి కురిసిన వర్షానికి కాసింత టెంపరేచర్ తగ్గి ఉపశమనం లభించింది. వర్షానికి కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా.. అధికారులు వెంటనే స్పందించి పునరుద్ధరించారు.