టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా: దుబ్బాక-జీహెచ్ఎంసీ ఘోర పరాభవాల ఫలితం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మేయర్ పీఠం దక్కించుకుంటామంటూ ఎన్నికల ప్రచారంలో ఎంతో ధీమాగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలకు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశనే నింపాయి.

దుబ్బాక-జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం..
ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రంగానే ప్రభావం చూపిన విషయం తెలిసిందే. తాజాగా, జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కేవలం రెండు స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లోనే గెలుపొందగా.. ఇప్పుడు కూడా అంతకుమించి ఒక స్థానం కూడా ఎక్కువ గెలువలేకపోయింది.

బాధ్యత నాదేనంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఓటమికి తనదే బాధ్యత అని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితోపాటు పలువురు కీలక నేతలు ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు.

కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఆ రెండు సీట్లు ఇవే..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలుపొందడం గమనార్హం. ఏఎస్ రావు నగర్ నుంచి ఎస్ శిరాషా రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఉప్పల్ నుంచి ఎం రజిత అనే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక 150 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాల్లో, ఎంఐఎం 43 స్థానాల్లో, బీజేపీ 50 స్థానాల్లో దాదాపు గెలుపును ఖరారు చేసుకున్నాయి. అయితే, టీడీపీకి ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications