షాకింగ్ రిపోర్ట్: కోవిడ్ మరణాలు ఎక్కువగా నమోదవడానికి కారణమదే-సెకండ్ వేవ్ ఇంకా ఎన్నిరోజులు?
కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్ దేశంలో పెను విషాదాన్ని మిగిల్చింది. గతేడాది కరోనా మొదటి వేవ్ నుంచి ఇప్పటివరకూ దేశంలో 3,03,720 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇందులో 1.5లక్షల మరణాలు సెకండ్ వేవ్లో సంభవించినవే. అందులోనూ ఈ ఏడాది మార్చి తర్వాత సంభవించిన మరణాలు 1.4 లక్షలు కాగా... ప్రస్తుత మే నెలలోనే ఇప్పటివరకూ 92వేల మరణాలు నమోదయ్యాయి. నిజానికి మే 6 తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గలేదు. ఇలా మరణాల సంఖ్య పెరగడానికి కొన్ని ప్రత్యేక కారణాలు కనిపిస్తున్నాయి...
అదే కారణం... అందుకే ఎక్కువ మరణాలు...
దేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా మరణాలను ఆలస్యంగా నమోదుచేస్తున్నాయి. కరోనా మరణాల సంఖ్యను ధ్రువీకరించి రిపోర్ట్ చేయడంలో రెండు వారాల జాప్యం కనిపిస్తోంది. దీంతో రెండు వారాల క్రితం కరోనాతో మృతి చెందినవారి లెక్కలు కూడా రోజువారీ లెక్కల్లో చేరిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోవిడ్ మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గడిచిన రెండు వారాల్లో వారం రోజుల్లో మరణాల సగటు 4వేల నుంచి 4190కి పెరిగింది. మే 6న దేశంలో 4.14 లక్షల కరోనా కేసులతో పీక్ స్టేజ్ నమోదైంది. ఆ తర్వాతి నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. నిజానికి మరణాల సంఖ్య నమోదులో జాప్యం లేకపోయి ఉంటే... ఇప్పుడు నమోదవుతున్నంత స్థాయిలో మరణాలు ఉండకపోయేవేమో...!
రెండు వారాల జాప్యం...
ఈ ఏడాది ఒక్క మే నెలలోనే ఇప్పటివరకూ 92 వేల కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది రెట్టింపు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... మహారాష్ట్ర,కర్ణాటక,తమిళనాడు లాంటి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మరణాల నమోదులో జాప్యం జరుగుతోంది. మహారాష్ట్ర విషయానికి వస్తే... అక్కడ కోవిడ్ మరణాల నమోదులో రెండు వారాల కంటే ఎక్కువ జాప్యం కనిపిస్తోంది. ఉదాహరణకు.. ఆదివారం(మే 23) మహారాష్ట్రలో 1320 కోవిడ్ మరణాలు నమోదవగా... ఇందులో 726 మరణాలు రెండు వారాల క్రితం నాటివి కావడం గమనార్హం. అత్యధిక కోవిడ్ మరణాలు నమోదవుతున్న కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది.
కర్ణాటకలో ఇప్పటికీ అదే పరిస్థితి...
కోవిడ్ మరణాల నమోదులో జాప్యం ఇప్పుడే కొత్తగా జరగుతున్నదేమీ కాదు. మొదటి నుంచి ఇదే జరుగుతూ వస్తోంది. నిజానికి కర్ణాటక ఇప్పటికీ మార్చి నాటి కోవిడ్ మరణాలను రోజు వారి కోవిడ్ మరణాల్లో నమోదు చేస్తోంది. ప్రస్తుతం సంభవిస్తున్న కోవిడ్ మరణాలను మరో రెండు లేదా మూడు వారాలు ఆలస్యంగా రిపోర్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా దేశవ్యాప్తంగా ప్రస్తుతం భారీ స్థాయిలో కోవిడ్ మరణాలు నమోదవుతుండటానికి కారణం... గతంలో నమోదు కాని మరణాలను ఇప్పుడు తీసుకొచ్చి చేర్చడమే. కాబట్టి గతంలో నమోదు కాని మరణాలను కొత్తగా నమోదవుతున్న మరణాలతో కలిపి రిపోర్ట్ చేయడం ఆగిపోతే... కోవిడ్ మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపించవచ్చు.
ఇంకా ఎన్నిరోజులు సెకండ్ వేవ్...
కోవిడ్ మరణాల నిష్పత్తిని తెలిపే సీఎఫ్ఆర్(case fatality ratio) గ్రాఫ్లో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది. కొద్ది వారాల క్రితం లాగా వేగంగా మరణాల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి ఇప్పుడు లేదు. సీఎఫ్ఆర్ గ్రాఫ్ ప్రకారం మార్చి మధ్య వారంలో మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ఏప్రిల్ చివరినాటికి అది పీక్స్కి చేరింది. అప్పటినుంచి ఇక తగ్గుదల కనిపిస్తోంది. గత వారంలో ప్రతీ 10వేల మందిలో 107 మంది కోవిడ్తో మృతి చెందారు. కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మరణాల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ప్రతీ 10వేల మందికి 134 మంది కోవిడ్తో మృతి చెందారు. ఒకవేళ రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య తగ్గకపోతే సీఎఫ్ఆర్ గ్రాఫ్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. రెండు వారాల క్రితం నాటికే పలు రాష్ట్రాల్లో కోవిడ్ మరణాల సంఖ్య పీక్స్కి చేరింది. ఛత్తీస్గఢ్,ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో కర్ణాటక,మహారాష్ట్ర,తమిళనాడుల్లో మరణాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే గతంలో నమోదు కాని మరణాలే ఇందులో ఎక్కువగా ఉండటం వల్లే ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ మరణాల సంఖ్య ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఈ లెక్కన సెకండ్ వేవ్ పీక్ ఇప్పటికే ఇక ముగింపు దశకు చేరుకుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video