భగ్గుమన్న రైతులు:మోదీ బొమ్మ దహనం - రాష్ట్రపతికి 15 పార్టీల లేఖ - 24న కాంగ్రెస్ నిరసనలు -ఉత్తరాన హీట్
వివాదాస్పదమైన రైతు బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్నదాతలు రోడ్లెక్కి నిరసనలకు దిగారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ సహా వివిధ రాష్ట్రాల్లో లక్షల మంది రైతులు ప్రదర్శనలకు, రాస్తారోకో నిర్వహించారు. పలు చోట్ల జాతీయ రహదారులను దిగ్బంధించడంతో గంటలపాటు రవాణా స్తంభించిపోయింది. అటు పార్లమెంట్ లోనూ బిల్లులను వ్యతిరేకిస్తూ సస్పెండైన ఎనిమిది మంది ఎంపీలు నిరవధిక దీక్షకు దిగడం, వారికి విపక్షపార్టీలన్నీ సంఘీభావం తెలపడం, పార్లమెంట్ సమీపంలోనూ నిరసనలు మిన్నంటడం గమనార్హం. ఈ క్రమంలో సోమవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రపతికి 15 పార్టీల లేఖ..
రాజ్యసభలో ఎన్డీఏకు బలం లేకపోయినా, అప్రజాస్వామికంగా బిల్లుల్ని ఆమోదింపజేసుకున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన విపక్షాలు.. సోమవారం మరో అడుగు ముందుకువేసి.. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లులపై సంతకాలు చేయొద్దంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు లేఖలు రాశాయి. కాంగ్రెస్, జేడీయూ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, టీఆర్ఎస్, ఆప్, ఆర్జేడీ, ఇండియన్ ముస్లిం లీగ్, ఎల్జేడీ తదితర 15 రాజకీయ పార్టీల నేతలు లేఖపై సంతకాలు చేశారు.

24న కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు..
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల్ని ‘చీకటి చట్టాలు'గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. మోదీ సర్కారు అంతులేని అహంకారాన్ని ప్రదర్శిస్తోందన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు.. ఈనెల 24న దేశవ్యాప్తంగా నిరసనలు జరపాలని నిర్ణయించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ శ్రేణులంతా 24న రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో భాగం పంచుకోవాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. రైతు సంఘాల ఐక్యవేదిక.. ''ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేఎస్సీసీ) ప్రకటించినట్లు ఈనెల 25న భారత్ బంద్ కూడా కొనసాగనుంది. ఏఐకేఎస్సీసీ బంద్ పిలుపునకు విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి.
Recommended Video

మోదీ దిష్టిబొమ్మల దహనం..
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ లో నిరసనలు హోరెత్తాయి. ఆదివారం నుంచి నిరవధికంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జలంధర్ జిల్లాలో మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పంజాబ్ వ్యాప్తంగా పలు చోట్ల బీజేపీ ప్రతిమలను రైతులు కాల్చేశారు. రాస్తారోకో సందర్భంగా కొన్ని చోట్ల ట్రాక్టర్లకు నిప్పుపెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్షాలు చేస్తోన్న నిరసనలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. మార్షల్స్ గనుక లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కు ప్రతిపక్షాలు హాని తలపెట్టి ఉండేవేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications