వ్యవసాయ చట్టాల ఎఫెక్టేనా?: యోగేశ్వర్ దత్ ఓటమి, హర్యానా బరోడాలో కాంగ్రెస్ గెలుపు
ఛండీగఢ్: హర్యానాలోని బరోనా స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అంతర్జాతీయ రెజ్లర్ యోగేశ్వర్ దత్ బీజేపీ-జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. యోగేశ్వర్పై కాంగ్రెస్ అభ్యర్థి ఇందురాజ్ నర్వాల్ 9200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఈ స్థానంలో ఈ ఒలింపిక్ క్రీడాకారుడికి ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.
గత అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణన్ హుడా చేతిలో ఓటమిపాలయ్యారు. హుడా ఆ స్థానం నుంచి వరుసగా మూడోసారి గెలుపొందారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హుడా మరణించడంతో ఈ ఉపఎన్నికలు జరిగాయి.

నవంబర్ 3న జరిగిన ఉపఎన్నిక ఫలితాలు నవంబర్ 10న వెల్లడయ్యాయి. కాగా, ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఉపఎన్నికలో వ్యవసాయ చట్టాల ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
సోనెపట్ జిల్లాలోని బరోడా.. జాట్ కీలక భూభాగంలో ఉన్న కొన్ని గ్రామీణ సీట్లలో ఒకటి, ఇక్కడ వ్యవసాయ చట్టాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఫలితాల తరువాత విడుదల చేసిన ఒక ప్రకటనలో.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా బరోడా గెలుపును "రైతు వ్యతిరేక పాలన" కు వ్యతిరేకంగా రైతులు సాధించిన విజయంగా పేర్కొన్నారు.
ఇదిలావుండగా, ఈ స్థానం కాంగ్రెస్ పార్టీదని, ఇప్పుడు అది వారితోనే ఉందని రాష్ట్ర బిజెపి చీఫ్ ఓపి ధన్కర్ తెలిపారు. అయితే, ఒక అంతర్జాతీయ క్రీడాకారుడిని విధానసభకు పంపలేకపోయామనే బాధ తమకు ఉందన్నారు. ప్రజా తీర్పును తాము అంగీకరిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications