షాక్: 3,400మంది యువకుల కిడ్నాప్, తుపాకీ పెట్టి తాళి కట్టించేశారు!
పాట్నా: తమకు నచ్చిన యువకుడ్ని కిడ్నాప్ చేసి తమ అమ్మాయికి ఇచ్చి వివాహం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రంలో భారీగా పెరిగిపోయాయి. అతనికి ఇష్టం ఉన్నా.. లేకున్నా.. సరే, తలకు తుపాకీ గురిపెట్టి మరీ మూడు ముళ్లు వేయిస్తున్నారు.
Recommended Video
పిలిచారని వెళ్తే! తలకు తుపాకీ పెట్టి తాళి కట్టించారు: ఏడ్చేసిన యువకుడు
ఇక్కడ ఈ పద్ధతిని 'పకడ్వా వివాహ్' అని పిలుస్తున్నారు. ఈ పద్ధతిలో పెళ్లి ఆశ్చర్యానికి గురి చేయొచ్చు.. కానీ, బీహార్లో ఈ విధానంలో వివాహాలు జరగడం సర్వసాధారణమైపోయింది.
బెదిరింపులకు గురిచేసి..
కాగా, 2017లో బీహార్ రాష్ట్రంలో 3,400 మంది కన్నా ఎక్కువ మంది యువకులను అపహరించి, బలవంతంగా తాళి కట్టించారని పోలీసుల తాజా నివేదికలో వెల్లడైంది. తలకు తుపాకీ గురిపెట్టి, లేదా కుటుంబ సభ్యులకు హాని తలపెడతామని బెదిరించి ఈ తంతు జరిపించినట్లు నివేదిక పేర్కొంది.
పెరిగిపోతున్న ‘పకడ్వా వివాహ్'ల సంఖ్య
‘నానాటికీ బీహార్లో ‘పకడ్వా వివాహ్' పద్ధతి బాగా వ్యాపించిపోతోంది. రాష్ట్రంలో గత సంవత్సరం 3,405 మందికిపైగా యువకులను అపహరించి, బలవంతంగా వధువు మెడలో తాళి కట్టించారు. ఇందులో చాలా వివాహాలు పాయింట్ బ్లాంక్లో గన్పెట్టి జరిపిస్తున్నవే కావడం గమనార్హం. ఇలాంటి వివాహాల సంఖ్య రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశమే' అని అధికారులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు..
ఈ నేపథ్యంలో వచ్చే పెళ్లిళ్ల సీజన్లో ‘పకడ్వా వివాహ్'లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు సూచించామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘పకడ్వా వివాహ్' కోసం 2016లో దాదాపు 3,070 మంది యువకులను, 2015లో 3,000 మంది యువకులను, 2014లో 2,526 మంది యువకులను అపహరించారు.
ఈ విషయంలో బీహార్దే పైచేయి
ఈ ప్రకారం బీహార్ రాష్ట్రంలో రోజుకు సగటున తొమ్మిది బలవంతపు వివాహాలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2015 లెక్కల ప్రకారం 18 ఏళ్లకుపైగా వయసున్న అబ్బాయిలను అపహరించడంలో దేశంలోనే బీహార్ మొదటి స్థానంలో ఉంది.‘పకడ్వా వివాహ్' సామాజిక సమస్య అని, వరకట్నం ఇబ్బందుల వల్ల పెళ్లికుమార్తె కుటుంబ సభ్యులు ఈ పద్ధతిని పాటిస్తున్నారని సామాజిక వేత్త మహేంద్ర యాదవ్ చెబుతున్నారు.
యువకులే లక్ష్యంగా..
18నుంచి 30ఏళ్ల మధ్య వయస్సున్న యువకులను మాత్రమే కిడ్నాప్ చేసి ఇలా బలవంతపు పెళ్లి చేస్తుండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు అడపాదడపా జరుగుతున్నా.. బీహార్ రాష్ట్రంలో మాత్రం సాధారణమైపోతోంది. గత నెలలోనూ ఓ యువకుడిని పెళ్లికని పిలిచి తుపాకీ పెట్టి మరీ తాళి కట్టించిన ఘటన సంచలనంగా మారింది.