షాకింగ్ : సీఎం నివాసం వద్ద విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులకు కరోనా..
మహారాష్ట్ర ముంబైలోని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు పోలీసులకు శనివారం(మే 2) కరోనా పాజిటివ్గా తేలింది. ఈ ముగ్గురు ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ ఆధీనంలోని స్థానిక ఆయుధ యూనిట్కి చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం వీరని క్వారెంటైన్లో ఉంచారు.
ఈ ముగ్గురిలో ఇద్దరు నైట్ షిఫ్ట్ ముగించుకుని శుక్రవారం ఇంటికెళ్లారని.. మూడో వ్యక్తి ఉదయం విధుల్లో ఉన్నాడని అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ముగ్గురితో కలిసి పనిచేసిన సిబ్బందిని సీఎం నివాసం వద్ద విధుల్లో నుంచి తొలగించనున్నారు. వారి స్థానంలో కొత్త సిబ్బందిని నియమిస్తారు.
గత నెల మాతోశ్రీ బయట ఉన్న ఓ టీ స్టాల్ యజమానికి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆ టీ స్టాల్కి వెళ్లిన 130 మందిని క్వారెంటైన్ చేశారు. సీఎం నివాసం వద్ద విధుల్లో ఉన్న వర్ష అనే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్కు కూడా ఏప్రిల్ 19న కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఆమెతో కాంటాక్ట్ అయిన ఏడుగురు మహిళా పోలీస్ సిబ్బందిని క్వారెంటైన్ చేశారు.
అటు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం వద్ద విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్కు కూడా ఇప్పటికే కరోనా పాజిటివ్గా తేలింది. ఇదిలా ఉంటే, గత నెలలో ముంబైలో ముగ్గురు కానిస్టేబుల్స్ కరోనాతో మృతి చెందారు. సందీప్ సర్వే(52),చంద్రకాంత్ పెందుర్కర్,శివాజీ సోనవానే అనే కానిస్టేబుళ్లు కరోనా బారినపడి కన్నుమూశారు.
ఇప్పటివరకు మహారాష్ట్రలో 11,506 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 485 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,000 కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,776కి చేరగా 1218 మంది మృత్యువాతపడ్డారు.