విక్రమ్ ల్యాండర్ దొరికితేనే కిందికి..అప్పటిదాకా చంద్రుడికి శాంతిపూజలు: పిల్లర్ ఎక్కిన వ్యక్తి
లక్నో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రాజెక్టు చిట్ట చివరి నిమిషంలో విఫలం కావడం.. ఆ వ్యక్తిని దిగ్భ్రాంతికి గురి చేసింది. జాబిల్లి ఉపరితలం మీదికి అడుగు మోపడానికి కొన్ని క్షణాల ముందు విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కావడం అతడిని నిరాశకు గురి చేసింది. విక్రమ్ ల్యాండర్ జాడ దొరుకుతుందేమోనంటూ ఇన్నాళ్లూ ఎదురు చూశాడు. అతను చూడని ఛానల్ లేదు. చదవని పత్రిక లేదు. అయినప్పటికీ.. విక్రమ్ ల్యాండర్ లభిస్తేగా. ఇక ఎన్నాళ్లీ ఎదురు చూపులు అని అనుకున్న అతగాడు.. ఏకంగా చందమామ కోసం శాంతి పూజలను నిర్వహించడం మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా- నిర్మాణంలో ఓ వంతెన పిల్లర్ ఎక్కి కూర్చున్నాడు. అక్కడి నుంచి దిగట్లేదు. ల్యాండర్ జాడ దొరికిన తరువాతే దిగొస్తానంటూ షరతులు పెడుతున్నాడు. తనను ఎవరైనా కిందికి దింపడానికి ప్రయత్నిస్తే.. దూకేస్తానంటూ బెదిరింపు ఒకటి.

పర్యావరణ అంటే ప్రేమ..శాస్త్ర సాంకేతిక రంగంపై ఆసక్తి..
అతని పేరు రజినీకాంత్. ఊరు.. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్. సామాజిక అంశాల పట్ల అతనికి మంచి అవగాహన ఉందని స్థానికులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ది గురించి తరచూ ప్రయాగ్ రాజ్ లో నిర్వహించే సభలు, సదస్సులకు హాజరవుతుంటాడట రజినీకాంత్. ఇదివరకు గంగానది ప్రక్షాళణ కోసం నడుం బిగించిన సందర్భాలు సైతం ఉన్నాయని అతని సన్నిహితులు వెల్లడించారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టు పై మొదటి నుంచీ ఆసక్తి కనపరుస్తూ వచ్చాడని చెప్పారు. ఇస్రో చేపట్టిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటోలు, వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగులను అదే పనిగా భద్రపరచి పెట్టుకున్నాని అన్నారు. ఈ నెల 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీదికి దిగడాన్ని టీవీకి అతుక్కుపోయి మరీ తిలకించాడని రజినీకాంత్ స్నేహితులు చెప్పారు. తీరా జాబిల్లి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో అనూహ్యంగా విక్రమ్ ల్యాండర్ జాడ కనిపించకపోవడం రజినీకాంత్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.

చంద్రుడి ఆగ్రహమే కారణమంటూ..
విక్రమ్ ల్యాండర్ జాడ దొరక్క పోవడానికి, జాబిల్లి ఉపరితలం మీద దిగడానికి కొన్ని క్షణాల ముందు గల్లంతు కావడానికి ప్రధాన కారణం.. చందమామ ఆగ్రహమేననేది అతని బలమైన విశ్వాసం. అందుకే- చంద్రుడి కరుణా కటాక్ష వీక్షణాల కోసం ప్రార్థనలు చేస్తానంటూ ప్రయాగ్ రాజ్ లో యమునా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెనకు సంబంధించిన పిల్లర్ ఎక్కి కూర్చున్నాడు. తను అభిలాష ఏమిటనేది ఓ పేపర్ మీద రాసి, కిందికి విసిరేశాడు. సోమవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో పిల్లర్ ఎక్కి కూర్చున్న రజినీకాంత్.. ఇప్పటిదాకా అక్కడే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఉన్న ఓ ఇంటరెస్టింగ్ పాయింట్ ఏమిటంటే- రజినీకాంత్ కు ఇలా హల్ చల్ చేయడం కొత్తేమీ కాదట. ఇదివరకు పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ అతను.. అదే పిల్లర్ మీదికెక్కి కూర్చున్న రికార్డు అతనికి ఉందని స్థానికులు చెబుతున్నారు.
కాగా.. అతణ్ని చూడటానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. తమ మొబైల్ కెమెరాల్లో అతణ్ని బంధిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

గంగా ప్రక్షాణళ కోసం..
ప్రయాగ్ రాజ్ వేదికగా అంగరంగ వైభవంగా కొనసాగిన అర్ధ కుంభమేళా ఉత్సవాల్లో రజినీకాంత్ చురుగ్గా పాల్గొన్నాడు. ఈ వేడుకలు ముగిసిన తరువాత.. గంగానది ప్రక్షాళన కోసం అహర్నిశలు శ్రమించాడనే పేరుంది అతనికి. ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛందంగా గంగానది ప్రక్షాళన కోసం కృషి చేశారని అంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు తరచూ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే వాడని అంటున్నారు. ఇదివరకు పర్యావరణ పరిరక్షణ కోసం ఇదే పిల్లర్ ను ఎక్కిన సందర్భాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఈ సారి చంద్రుడికి శాంతి పూజల పేరుతో పిల్లర్ పైకి ఎక్కి కూర్చోవడం తమను కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications