బీజేపీకి ఆమ్ ఆద్మీ కౌంటర్ థియరీ.. అస్త్రాన్ని సిద్దం చేసిన కేజ్రీవాల్.. త్వరలో పార్టీ విస్తరణ..
ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఛరిష్మాపై అంచనాలు రెట్టింపయ్యాయి. కేజ్రీవాల్ సరైన విధానంలో ముందుకు వెళ్తే.. భవిష్యత్తులో ప్రధాని అభ్యర్థిగా ఎదగవచ్చునన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెలుపల పార్టీ విస్తరణపై అరవింద్ కేజ్రీవాల్ ఫోకస్ చేశారు. అంతేకాదు,బీజేపీని ధీటుగా సవాల్ చేసేందుకు కౌంటర్ థియరీని కూడా సిద్దం చేశారు. అదే అస్త్రంతో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్నారు. ముందుగా ఆయా రాష్ట్రాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

కౌంటర్ థియరీ..
బీజేపీకి కౌంటర్ థియరీగా సానుకూల జాతీయవాదాన్ని ప్రయోగించబోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ తెలిపారు. సానుకూల జాతీయవాదం ద్వారా పార్టీ విస్తరణ చేపట్టాలనుకుంటున్నామని.. ఇందుకోసం ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశం నిర్వహించబోతున్నామని తెలిపారు. రాబోయే మధ్యప్రదేశ్,గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందన్నారు. అలాగే భవిష్యత్తులో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.

దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణంపై ఫోకస్..
దేశవ్యాప్తంగా కార్యకర్తలను చేర్చుకుని.. పార్టీ నిర్మాణాన్ని చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు గోపాల్ రాయ్ తెలిపారు. పార్టీలో చేరాలనుకునేవారు 9871010101 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సభ్యత్వం పొందవచ్చునని చెప్పారు. ఈ క్యాంపెయిన్ ద్వారా తాము పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నామని.. భారీ సంఖ్యలో కార్యకర్తలను చేర్చుకుంటామని రాయ్ అన్నారు.

సానుకూల జాతీయవాదంతో..
ప్రస్తుతం బీజేపీ దేశంలో ప్రతికూల జాతీయవాదంతో ముందుకు వెళ్తోందని.. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ సానుకూల జాతీయవాదంతో ముందుకు వెళ్తుందని రాయ్ స్పష్టం చేశారు. బీజేపీ జాతీయవాదం విద్వేషంతో కూడిన విభజన రాజకీయాలని విమర్శించారు. కానీ ఆమ్ ఆద్మీ సానుకూల జాతీయవాదం ప్రేమ,గౌరవం ప్రాతిపదికగా ఉంటుందని.. ఢిల్లీలో దీన్ని వ్యాప్తి చేస్తామని చెప్పారు. తద్వారా దేశం మొత్తానికి ఢిల్లీ ఆదర్శంగా నిలిచేలా చేస్తామన్నారు.

సానుకూల జాతీయవాదంలోని అంశాలు..
సానుకూల జాతీయవాదంలో నాణ్యమైన విద్య,వైద్యం,సమాజంలోని అన్ని వర్గాలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయని తెలిపారు. బీజేపీకి మతమే రాజకీయ అస్త్రమని.. కానీ ఈ దేశ ప్రజలకు మతం ఒక విశ్వాసం అని ఓ ప్రశ్నకు సమాధానంగా రాయ్ చెప్పారు. దేశ ప్రజలను బీజేపీ గౌరవించదని, ప్రతీ ఒక్కరిని ఓటు బ్యాంకుగా జమకడుతుందని విమర్శించారు. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ 62 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.












Click it and Unblock the Notifications