పక్షపాతం వద్దు, వాళ్లపైనా దృష్టి పెట్టండి: సోనియా
ఢిల్లీ: ప్రతిపక్షాలకు వత్తాసు పలుకుతూ.. అవినీతి సమస్య విషయంలో మీడియా సంస్థలు పక్షపాతం వహిస్తూ కథనాలను ప్రసారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హెచ్చరించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెసేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ అవినీతిపై మీడియా దృష్టి సారించాలని అన్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాలనలోని గుజరాత్లో కూడా, అక్కడి కొందరు మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వాటిపైనా మీడియా దృష్టి పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోని రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోని అవినీతిపై కూడా మీడియా దృష్టి సారించాలని సోనియా అన్నారు.
తమ ప్రభుత్వ పాలనలో ఉన్న మహారాష్ట్రలోని తమ పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సమయంలో ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంపై జుడిషియల్ కమిషన్ విచారణ జరిగిందని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర కేబినెట్ డిసెంబర్ 20న ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను తిరస్కరించింది. అయితే మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రుల సమావేశంలో తప్పుపట్టారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా పాల్గొన్నారు.
కాగా వ్యక్తిగతంగా తాను ఆ నిర్ణయాన్ని అంగీకరించనని రాహుల్ గాంధీ తెలిపారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందులో ఎవర్ని కాపాడుతున్నారనే ప్రశ్న అవసరం లేదని రాహుల్ తెలిపారు. ఆ నివేదిక సమస్యకు పరిష్కారం చూపుతుందని సోనియా గాంధీ శనివారం తెలిపారు. కాగా మాజీ న్యాయమూర్తి జెఏ పాటిల్ నేతృత్వంలోనే జుడిషియల్ కమిషన్ ఆదర్శ్ కుంభ కోణంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత విలాస్ రావు దేశ్ ముఖ్, సుశీల్ కుమార్ షిండేలను దోషులు ప్రకటిస్తూ నివేదిక వెల్లడించింది.