విమానాన్ని ఢీ కొన్న పక్షి.. మణిపూర్ సీఎం సహా 160 మందికి త్రుటిలో తప్పిన ప్రమాదం
గౌహతి: దిల్లీ-గౌహతి-ఇంఫాల్ ఎయిరిండియా విమానానికి శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. 160 మందితో ప్రయాణిస్తున్న విమానం గౌహతి విమానాశ్రయంలో దిగుతుండగా విమానాన్ని ఓ పక్షి ఢీకొంది.
దీంతో విమానంలోని ముందు భాగం కొంత పాడైపోయినప్పటికీ పైలట్ చాకచక్యంగా విమానాన్ని దించేశారు. ఈ ప్రమాదం కారణంగా విమానం గౌహతిలోనే ఆగిపోయింది. దీంతో ఇంఫాల్ వెళ్లాల్సిన ప్రయాణికులు గౌహతి విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సహా 160 మంది ప్రయాణికులు ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రకటించారు.
తాను ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానానికి పక్షి తగిలిందని, గౌహతిలో సురక్షితంగా ల్యాండ్ అయిందని శుక్రవారం బీరేన్ ట్వీట్ చేశారు. ఎయిరిండియా అధికార ప్రతినిధి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విమానాన్ని తమ ఇంజనీర్ల బృందం పరిశీలిస్తోందని చెప్పారు.
అయితే గౌహతి విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజ్మెంట్ అస్సలు బాగోలేదని ముఖ్యమంత్రి బీరేన్ మరో ట్వీట్లో తెలిపారు. చాలా మంది ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారని, ఆహారం వసతి ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు.
ముగ్గురు ఎయిరిండియా సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉన్నారని, శనివారం మధ్యాహ్నం వరకు మరో విమానం కూడా అందుబాటులో లేదని సంస్థ అధికారులు తెలిపినట్లు బీరేన్ వెల్లడించారు. మరోవైపు పరిస్థితి చక్కదిద్దేందుకు ఎయిరిండియా అన్ని విధాలా ప్రయ్నతిస్తోందని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.