యూపీ.. నియంతృత్వ రాజ్యం: కలెక్టర్ శాలరీ నుంచి రూ. 5 లక్షలు వసూలు చేయండి: హైకోర్టు ఆదేశం
గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపం చిక్కుల్లో పడ్డారు. విద్యార్థిని, సామాజిక కార్యకర్త ఆకృతి చౌదరిపై జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకోవడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుపట్టింది. ఆమెపై నమోదైన కేసును కొట్టివేసింది. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల ఏకపక్ష ధోరణిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని మేధా రూపం, ఈ కేసులో సంబంధం ఉన్న పోలీస్ అధికారుల జీతాల నుంచి రికవరీ చేయాలని తీర్పు ఇచ్చింది.
జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్దేవ్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఈ తీర్పును వెలువడించింది. అధికారుల వైఖరి, నిరంకుశ ప్రవర్తన వల్ల ఉత్తరప్రదేశ్.. భవిష్యత్తులో నియంతృత్వ రాజ్యంగా భీతావహ వాతావరణం కలిగిన ఆర్వెలియన్ డిస్టోపియాగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తగిన ఆధారాలు లేకుండానే ఆకృతి చౌదరిని జైలులో ఉంచడం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆమె ప్రాథమిక హక్కును హరించినట్లయిందని స్పష్టం చేసింది.

మేధా రూపం వ్యవహరించిన తీరును ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. పోలీసుల నివేదికల ఆధారంగా ఎటువంటి లోతైన పరిశీలన లేకుండానే ఓ సాధారణ విద్యార్థినిపై ఎన్ఎస్ఏ వంటి కఠినమైన చట్టాన్ని ప్రయోగించారని వ్యాఖ్యానించింది. హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి, వారి భావప్రకటన స్వేచ్ఛను హరించేలా ఆకృతి చౌదరిపై ఈ విధమైన అణచివేత చర్యలకు పాల్పడ్డారని అభిప్రాయపడింది.
ఢిల్లీ యూనివర్శిటీ లా విద్యార్థిని ఆకృతి చౌదరిని ఈ ఏడాది ఏప్రిల్ లో నొయిడా కార్మికుల నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మే 13న ఆమెతో పాటు మరో జర్నలిస్ట్ సత్యం వర్మపై ఎన్ఎస్ఏ చట్టాన్ని ప్రయోగించారు. ఆకృతి కార్మికులను హింసకు ప్రేరేపించినట్లు ఛార్జిషీట్ లో పొందుపరిచారు. దీన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. హింసకు ప్రేరేపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని హైకోర్టు పేర్కొంది.
ప్రభుత్వం సమర్పించిన వాట్సాప్ చాట్, వీడియోలలో ఎక్కడ కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆందోళనకారులను రెచ్చగొట్టినట్లు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. శాంతిభద్రతల ముప్పు ఉందనే ఊహాగానాలతో ప్రజోపయోగ నిరసనలను అణచివేయడం సరికాదని హితవు పలికింది.
ఆమెను ఏప్రిల్ 11న సాయంత్రం బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నప్పటికీ, పోలీసులు రికార్డుల్లో ఏప్రిల్ 12న అరెస్టు చేసినట్లు సృష్టించారని కోర్టు ఎత్తి చూపింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 130 కింద జారీ చేసిన నోటీసులలో జనరల్ డైరీ నంబర్ను ముందుగానే పేర్కొనడం ద్వారా పోలీసులు తప్పుడు పత్రాలను సృష్టించారని, ఈ ప్రక్రియ అంతా ఒక ప్రహసనమని న్యాయమూర్తులు ఆక్షేపించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అసలైన యజమానులని, ప్రభుత్వ అధికారులు రాజ్యాంగానికి కట్టుబడి సేవ చేయాలని ధర్మాసనం హితవు పలికింది. బ్రిటీష్ పాలన నాటి వలసవాద ధోరణితో కాకుండా రాజ్యాంగబద్ధమైన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేసింది. రాజకీయ నేతల ప్రసన్నం కోసం కాకుండా, పౌరుల హక్కుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్, జిల్లా అధికార యంత్రాంగాన్ని సూచించింది. బాధితురాలికి చెల్లించాల్సిన రూ. 5 లక్షల పరిహారంలో వాటాను మేధా రూపం మొదలుకుని ఎన్ఎస్ఏ నివేదికను సిద్ధం చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరి జీతాల నుండి రికవరీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.













Click it and Unblock the Notifications
