కర్ణాటక మాదే, 130సీట్లతో ప్రభుత్వం: ఓటమేనంటూ సిద్ధరామయ్యను ఏకేసిన అమిత్ షా
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. నేటితో ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్య భారతదేశంలో అత్యంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఘాటుగా విమర్శించారు.
సిద్ధరామయ్య ప్రభుత్వ నేరాలను మాత్రమే అభివృద్ధి చేసిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలు కర్ణాటకలోనే ఎక్కువగా చోటు చేసుకున్నాయని అన్నారు. మహారాష్ర్టలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలను తగ్గించిందని పేర్కొన్నారు.
సిద్ధరామయ్యపై ప్రజలు కోపంగా..
కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను నిలువరించడంలో విఫలమైందన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. కర్ణాటక అభివృద్ధి, రాజధాని బెంగుళూరుపై ఆధారపడి ఉందని, కానీ బెంగుళూరుకు సిద్ధరామయ్య సర్కార్ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.
సిద్ధరామయ్యకు రెండింట్లోనూ ఓటమి తప్పదు
సిద్ధరామయ్య రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారని, ఆ రెండు స్థానాల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అమిత్ షా ఆరోపించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం బెంగళూరుకు చేసిందేమీ లేదని, బెంగళూరులో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.
సిద్ధరామయ్య అభివృద్ధి ట్రాఫిక్లోనే..
సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అమిత్ షా అన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు పెరిగాయని అన్నారు. అంతేగాక, రాజధాని నగరంలో క్రైం రేటు కూడా పెరిగిందని అన్నారు. సిద్ధరామయ్య చేస్తున్న అభివృద్ధి బెంగళూరు ట్రాఫిక్లోనే చిక్కుకుపోయిందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ హత్యలే..
కర్ణాటక ప్రభుత్వం 24మంది బీజేపీ నేతలను హత్య చేయించిందని అమిత్ షా ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. సిద్ధరామయ్య ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు. 5వేల కిలోమీటర్లు పర్యటించి సిద్ధరామయ్య ప్రభుత్వ వైఫల్యాలను వివరించామన్నారు.
130సీట్లతో ప్రభుత్వం.. యడ్డీ ఐదేళ్ల సీఎం..
రైతులకు అండగా ఉండేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. విజయవంతంగా ప్రచారం చేశామని, ప్రజలకు మరింత దగ్గరయ్యామని అమిత్ షా తెలిపారు. యడ్యూరప్ప షార్ట్ టైం సీఎం కాదని, ఐదేళ్ళపాటు అధికారంలో ఉండే సీఎం అని అన్నారు. జేడీఎస్తో పొత్తు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. 130సీట్లతో తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. అతి విశ్వాసంతో కాదు, ఆత్మవిశ్వాసంతో చెబుతున్నామని అమిత్ షా స్పష్టం చేశారు.