రాంచిలో మరో లవ్ జిహాద్: నా భర్త బలవంతంగా మతం మార్పించాడు
రాంచీ: లవ్ జిహాద్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా మరో యువతి తన భర్త పైన ఆరోపణలు చేస్తోంది. గురువారం సాయంత్రం రాంచీకి చెందిన ఓ యువతి మాట్లాడుతూ.. తన భర్త తనను బలవంతంగా మత మార్పిడి చేశాడని ఆరోపించింది.
స్థానిక భారతీయ జనతా పార్టీ నేత జయ భండారీతో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త అన్వర్ పైన ఆమె రాంచి నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను మతం మార్చుకునేందుకు అనేక విధాలుగా హింసించాడని ఆరోపించింది.
తనను నిత్యం కొట్టేవాడని, వివిధ రకాల మెడిసిన్స్ ఇచ్చాడని, ఓసారి అయితే తన బట్టలు విప్పాడని, బాగా చలిగా ఉన్న ఐస్లా ఉండే చన్నీటితో స్నానం చేయమని వేధించేవాడని, అలాగే కూలర్ ముందు నిలబెట్టేవాడని ఆమె ఆరోపించినట్లుగా చెబుతున్నారు. ఐదు నెలల క్రితం కూడా ఓ యువతి తనను తన భర్త బలవంతంగా మతం మార్చాడని ఫిర్యాదు చేసింది.
కాగా, విశ్వహిందూ పరిషత్ పత్రిక కవర్ పేజీపై నటి కరీనా ఫోటోను ఉపయోగించుకోవడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. హిందూ మతానికి చెందిన యువతులను లవ్ జీహాదీ పేరిట పెళ్లి చేసుకుని ముస్లింలుగా మారుస్తున్నారంటూ విహెచ్పీ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే కరీనా కపూర్ ముఖ చిత్రానికి ఒక భాగం బురఖా, మరో భాగం హిందూ సంప్రదాయం కలిగిన యువతిగా నుదిటిన బొట్టుతో ఉన్న ఫోటోను పత్రిక కవర్పేజీపై చిత్రించారు. దీనిపై కరీనాకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చని వీహెచ్పీ నేతలు సవాల్ విసిరారు.