శశికళకు సుప్రీం మళ్లీ షాక్: గడువు పెంచడం కుదరదు, లొంగిపోవాల్సిందే..
గడువు పెంచడం కుదరదని వెంటనే లొంగిపోవాలని శశికళకు సుప్రీం స్పష్టం చేసింది.
చెన్నై: లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలంటూ కోర్టులో అప్పీల్ చేసుకున్న అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీం నుంచి చుక్కెదురైంది. గడువు పెంచడం కుదరదని వెంటనే లొంగిపోవాలని సుప్రీం స్పష్టం చేసింది.
కాగా, అనారోగ్య కారణాలను చూపిస్తూ లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలని మంగళవారం నాడు శశికళ కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ పై కూడా సుప్రీం ప్రతికూలంగానే స్పందించడంతో శశికళ ముందున్న దారులన్ని ఇక మూసుకుపోయినట్టే కనిపిస్తున్నాయి.
అదే సమయంలో బుధవారం నాడు శశికళ రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తారన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. తాజా సుప్రీం తీర్పు నేపథ్యంలో శశికళ లొంగిపోతారా? లేక ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
ఇదిలా ఉంటే, రూ.66కోట్ల అక్రమాస్తుల కేసులో మంగళవారం నాడు తీర్పు వెలువరించిన సుప్రీం.. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.