తుత్తుకూడి: రాజకీయ ప్రత్యర్ధులు, ఎన్జీవోలు ప్రజలను తప్పుదోవ పట్టించారు: సీఎం
చెన్నై:తుత్తుకూడిలో స్టెరిలైట్ ఫ్యాక్టరీ విస్తరణను నిరసిస్తూ ఆందోళన చేపట్టడంపై తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు. కొన్ని రాజకీయపార్టీలు, స్వచ్చంధసంస్థలు, సంఘ విద్రోహశక్తులు స్థానికులను తప్పుదోవ పట్టించడం వల్లే ఈ పరిస్థితి చోటు చేసుకొందని ఆయన ఆరోపించారు.
తుత్తుకూడిలో స్టెరిలైట్ వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో సుమారు 13 మంది మరణించారు. ఈ ఘటనపై సీఎం పళనిస్వామి గురువారం నాడు స్పందించారు. ఈ ఫ్యాక్టరీ కారణంగా పరిసరాలు కాలుష్యం అవుతున్నాయని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన బాట పట్టారు.

తుత్తుకూడి కాల్పులకు కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు, సంఘవ్యతిరేక శక్తులు ప్రజలను తప్పుదారి పట్టించడమే కారణమని పళనిస్వామి ఆరోపించారు. ప్రజలు తిరగబడి దాడులు చేయడం వల్లే వారిని ఎదుర్కొని ఆత్మరక్షణ కోసం పోలీసులు చర్యలు చేపట్టాల్సి వచ్చిందని పోలీసులను వెనకేసుకొచ్చారు.
పోలీసులు నిరసనకారులపై నేరుగా కాల్పులు ఎలా జరుపుతారన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. కాగా తూత్తుకుడి ఘర్షణల్లో 13 మంది మరణించగా, 67 మందికి గాయాలయ్యాయి. హింసకు పాల్పడ్డారంటూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహరంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనను చేపట్టాయి. గతంలో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో ఈ ఫ్యాక్టరీని మూసివేశారు. కానీ, ఆ తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకొంది.ప్రస్తుతం తుత్తుకూడి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications