ఉగ్ర కుట్ర?: ఢిల్లీ వెళ్తూ ఆర్మీ కెప్టెన్ అదృశ్యం
కతిహార్: రైలులో కతిహార్ నుంచి న్యూఢిల్లీ వెళ్తూ ఓ ఆర్మీ కెప్టెన్ అదృశ్యమైన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బీహార్కు చెందిన శిఖర్దీప్(24) ఆర్మీ కెప్టెన్గా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు.
ఫిబ్రవరి 6న కతిహార్ నుంచి ఢిల్లీకి మహానందా ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ అదృశ్యమయ్యాడు. ఆసాయంత్రంలోగా ఢిల్లీ చేరుకుంటానని చెప్పిన శిఖర్దీప్ జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
ఇందులో ఉగ్రవాదుల కుట్ర ఉందంటూ శిఖర్దీప్ తండ్రి కల్నల్ రత్నకుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిఖర్దీప్ లగేజ్ రైలులో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శిఖర్ దీప్ మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని చెప్పారు.
మంగళవారం కతిహార్ రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్పీ జితేంద్ర మిశ్రా తెలిపారు. శిఖర్ దీప్ నెల రోజుల సెలవుపై ఇంటికి వచ్చి తిరిగి విధుల్లో చేరేందుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.