80 ఏళ్ల వృద్ధుడు కాదు.. యువకుడు ప్రధాని కావాలి: ఒవైసీ సంచలన ప్రకటన!
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఆయన ఇండియా కూటమి, ఎన్డీఏను రెండింటినీ లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 లోక్సభ ఎన్నికల గురించి అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. 2029 ఎన్నికల్లో భారత ప్రధాని 80 ఏళ్ల వృద్ధుడు కాకుండా ఓ యువకుడు అయ్యేలా చూసేందుకు తన వంతు కృష్టి చేస్తానని ఒవైసీ అన్నారు. "యువత, ఈ పోరాటం మీ భవిష్యత్తు కోసం. నేను నాయకుడిని కావడానికి ఇక్కడికి రాలేదు. మీరు నాయకులు కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎంపీలు అవ్వండి. మీరు ఎమ్మెల్యేలు అవ్వండి. ఈ కలంతో మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి." అని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
2029లో ఈ దేశానికి 80 ఏళ్ల వృద్ధుడు ప్రధానమంత్రి కాబోరని ఏఐఎంఐఎం అధినేత అన్నారు. 40-45 ఏళ్ల యువకులు ఈ దేశపు తలరాతను మారుస్తారని.. అప్పుడే శాంతి, న్యాయం ఉంటాయని, ఎవరూ ద్వేషాన్ని పెంచుకోరని ఆయన అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ సీఏఏ నిరసనలను కూడా ప్రస్తావించారు. సీఏఏ నిరసనల సమయంలో జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులను క్యాంపస్లోనే దారుణంగా కొట్టడం కూడా ఓ అమానుషమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

ఎంఐఎం పార్టీ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. 2027 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీతో చేతులు కలపడానికి తాను సిద్ధంగా ఉన్నానని అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, "ఈరోజే మాట్లాడాల్సిన సమయం. ఎన్నికలు ముగిశాక ఏడవకండి. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఏఐఎంఐఎం కోరుకోవడం లేదు" అని అన్నారు. ఒవైసీ ప్రకటనపై స్పందిస్తూ ఎంఐఎం పార్టీ యూపీ అధ్యక్షుడు షౌకత్ అలీ.. ఏఐఎంఐఎం ప్రకటన ఇండియా కూటమికి ఓ హెచ్చరికతో పాటు ఓ ప్రతిపాదన కూడా అని అన్నారు.
ఇటీవల యూపీలో పర్యటించిన అసదుద్దీన్ ఒవైసీ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత పోరాటానికి, వారి కృషికి లభించిన ఓ ప్రధాన విజయమని అన్నారు. "ఈ విజయం అబద్ధాలపై హక్కులు సాధించిన గెలుపు. ఇది ఆ యువతరం చేసిన త్యాగం, కఠోర శ్రమకు లభించిన విజయం" అని ఆయన అన్నారు. ఓ ప్రశ్నకు ఒవైసీ సమాధానమిస్తూ .."నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏదైనా చేయగలమని అనుకుంటే.. నియంతృత్వం ఇకపై పనిచేయదని ఈ ఉద్యమం స్పష్టమైన సందేశం పంపింది. ప్రజాస్వామ్యం నడవాలంటే, అది రాజ్యాంగ పరిధిలోనే జరగాలి" అని అన్నారు.














Click it and Unblock the Notifications