అగ్గిపెట్టైపై అనవసర రాద్ధాంతం, అమరావతిలో విమాశ్రయంపై తర్వాతే: అశోక్
న్యూఢిల్లీ: తాను మంత్రి అయిన తర్వాత తనను తనిఖీ చేయడం లేదని, దాంతో తాను జేబులో అగ్గిపెట్టె పెట్టుకునే విమానాల్లో ప్రయాణిస్తున్నానని చేసిన వివాదాస్పద ప్రకటనపై పౌర విమానయానాల మంత్రి పి. అశోక్ గజపతిరాజు బుధవారం ప్రతిస్పందించారు. తన వ్యాఖ్యలపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.
తన వ్యక్తిగత అభిప్రాయాలను వక్రీకరించడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులను కూడా తనిఖీ చేయాల్సిందేనని ఆయన చెప్పారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. బుధవారం ఢిల్లీలో విలేఖరులతో మంత్రి మాట్లాడారు. విస్తరణ పనులు పూర్తయ్యాక గన్నవరంలో టెక్నాలజీ, సర్వీసులు పెంచుతామని మంత్రి పేర్కొన్నారు. గన్నవరం రన్వే పొడవు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

విమాన ప్రయాణికుల భద్రతపై అమెరికా ప్రతినిధితో చర్చించామని భద్రతలో కేటగిరి 2 నుంచి 1 కి చేరడం శుభపరిణామమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కొత్తగూడెంలలో విమానాశ్రయాల ఏర్పాటుకు అందిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని మంత్రి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపికైన అమరావతిలో విమానాశ్రయం ఏర్పాటుపై మాస్టర్ ప్లాన్ పూర్తయిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని అశోక్ గజపతి రాజు చెప్పారు.












Click it and Unblock the Notifications