ఎన్నికల ప్రచారంలో ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్
గౌహతి: కాంట్రోవర్సియల్ ఐటమ్ గర్ల్, రాజకీయ నాయకురాలు రాఖీ సావంత్.. అసోం అసెంబ్లీ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) (ఆర్పీఐ) తరఫున ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. ఆమె ప్రచారం చేస్తారని ఆర్పీఐ వర్గాలు వెల్లడించాయి.
ఆర్పీఐ మహారాష్ట్రలోని దళితుల హక్కుల కోసం పోరాడుతోంది. అంబేడ్కర్ బాటలో ఈ పార్టీ పోరాటం చేస్తోంది. ఆ పార్టీ రాజకీయాలలోకి ఈ మధ్యనే ప్రవేశించింది. ఆర్పీఐ మహిళా విభాగానికి చీఫ్గా రాఖీ సావంత్ పని చేయనుంది.
సింగర్, నటి సల్మా అఘ్నాను కూడా ప్రచారానికి దించనున్నట్లు ఆర్పీఐ తెలిపింది. అభ్యర్థుల తొలి జాబితాను ఇటీవలే ఆ పార్టీ ప్రకటించింది. త్వరలోనే మిగతా అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. రాఖీ సావంత్ ప్రచారం చేయడం, కార్యక్రమాలలో పాల్గొనడం తమకు కలిసొచ్చే అంశమని ఆర్పీఐ చెబుతోంది. నానా పటేకర్ కూడా ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.