ఆఫీస్పై దాడి: భద్రత వద్దేవద్దని కేజ్రీవాల్, అసభ్య ప్రవర్తన
న్యూఢిల్లీ: తాను కానీ, తమ పార్టీ నేతలు కానీ భద్రత విషయమై పునరాలోచించేది లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం పునరుద్ఘాటించారు. ఉదయం కొందరు ఎఎపి కార్యాలయం పైన దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈ సంఘటన తర్వాత కూడా భద్రత విషయంలో పునరాలోచన లేదని చెప్పారు. దాడి సమయంలో ఎఎఫి కార్యాలయం వద్ద కనీస భద్రత మాత్రమే ఉందని చెప్పారు.
కాగా, హిందూ రక్షా దళ్ పేరుతో బ్యానర్లు పట్టుకొని కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న ఆప్ కార్యాలయంపై ఉదయం పలువురు దాడి చేశారు. రాళ్లు రువ్వి కిటికీల అద్దాలు పగులగొట్టారు. కార్యాలయ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు. ఎఎఫి నేత ప్రశాంత్ భూషణ్ కాశ్మీర్ పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగింది.
2011లో కూడా ఇదే గ్రూప్ తన కార్యాలయం పైన దాడి చేసిందని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. దాడికి పాల్పడిన వారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేనని ఆయన ఆరోపించారు.