ఇంటర్వ్యూల్లోనే 99 శాతం అవినీతి.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగ పరీక్ష నియామకాలు.. పేపర్ లీక్ లు, విద్యా వ్యవస్థ.. తదితర అంశాలపై యోగ గురు రామ్ దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా యువత ఆందోళనలకు కారణం విద్యావ్యవస్థలో, ప్రభుత్వ పోటీ పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అవకతవకలు మాత్రమే కారణం అని అన్నారు. ఇవి విద్య, ఉపాధి వ్యవస్థల్లో ఉన్న తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయని అన్నారు. ఇంటర్వ్యూల సమయంలోనే 90 శాతానికి పైగా అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. కులం, మతం, భావజాలం వంటి వాటి ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించేవారు కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. దాంతో అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ మేరకు పతంజలి యోగపీఠంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా రామ్ దేవ్ బాబా మాట్లాడారు. విద్యార్థులు, యువత చేపట్టే ఆందోళనలు శృతి మించరాదని స్పష్టం చేశారు.
హరిద్వార్ లోని పతంజలి యోగిపీఠంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించిన అనంతరం యోగ గురు రామ్ దేవ్ బాబా.. జార్ఖండ్ లో జరుగుతున్న జెన్ జీ విద్యార్థుల పోరాటంపై మాట్లాడారు. " దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అనేక పాఠశాలలు, కాలేజీల్లో కనీస మౌలిక వసతులు లేవు. టీచర్లు, బుక్స్, ఎలక్ట్రిసిటీ, మంచినీరు లేదా టాయిలెట్స్ అందుబాటులో లేవు" అని రామ్ దేవ్ బాబా స్పష్టం చేశారు. ఒకవేళ ఈ కనీస వసతులు ఉన్నా పరీక్షల్లో అవకతవకలు.. చీటింగ్, పేపర్ లీక్ కారణంగా పరీక్ష వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.. అని రామ్ దేవ్ బాబా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో 90 నుంచి 99 శాతం ఇంటర్వ్యూల వద్దే అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.

ఓ వైపు మనం సత్యమేవజయతే అని నినాదాలు చేస్తుంటాం.. మరోవైపు ఉద్యోగాలు డబ్బులకు అమ్మకాలు జరుగుతున్నాయని రామ్ దేవ్ బాబా స్పష్టం చేశారు. అవినీతి, అవకతవకల ఆరోపణలను తేలిగ్గా విస్మరించలేమని పేర్కొన్నారు. అలాగే నిరసనల పేరిట అరాచకాన్ని, హింసను తాను సమర్థించనని రామ్ దేవ్ బాబా స్పష్టం చేశారు. ఈ మేరకు రాజకీయ పార్టీలకు పలు సూచనలు చేశారు. దేశంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదాన్ని మరొకటి శత్రువులుగా భావించుకోకూడదని రామ్ దేవ్ బాబా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications