మీ సమస్య ఏంటి: బీబీఎంపీ ఎన్నికలపై సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ: బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలు నిర్వహించడానికి మీకు వచ్చిన సమస్య ఏమిటి అని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పదేపదే తమకు సమయం కావాలని చెప్పడం భావ్యంగా లేదని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.
సమయం ఇవ్వడానికి వీలు కాదని తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. బీబీఎంపీ ఎన్నికలు 8 వారాలలోపు పూర్తి చెయ్యాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఎన్నికలు నిర్వహించడానికి కొంత సమయం కావాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది. సోమవారం అర్జీ విచారణ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ అర్జీ విచారణ చేసింది.
తరువాత ఎన్నికలు వాయిదా వెయ్యడానికి వీలు కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే మీకు గడువు ఇచ్చాం, ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు పదేపదే సమయం కావాలని అడుగుతున్నారు, అసలు మీకు వచ్చిన సమస్య ఏమిటి అని ప్రశ్నించారు.
మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించండి, ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించండి అని సుప్రీం కోర్టు సూచించింది. జులై 27వ తేదికి కేసు విచారణ వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 22వ తేదిన బీబీఎంపీ ఎన్నికలు జరగనున్నాయి.