నీకెంత మంది పిల్లలు?: మహిళ పట్ల బీజేపీ ఎమ్మెల్యే అసభ్యకర వ్యాఖ్యలు..
తొలుత నీకెంతమంది పిల్లలు? అని ప్రశ్నించారు. దీనికి ఇద్దరు పిల్లలు అని ఆమె బదులిచ్చింది. ఇద్దరు పిల్లలు ఒకేసారి పుట్టారా? అంటూ రాధామోహన్ తన నోటి దురుసును బయటపెట్టుకున్నారు.
గోరఖ్పూర్: గోరఖ్పూర్ బీజేపీ ఎమ్మెల్యే రాధా మోహన్ దాస్ అగర్వాల్ మరోసారి తన నోటి దురుసును బయటపెట్టుకున్నారు. ఇటీవలే ఓ మహిళా ఐపీఎస్ అధికారిణితో అనుచితంగా ప్రవర్తించిన ఆయన.. సమస్యలు పరిష్కరించమని కోరినందుకు మరో మహిళపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో మోడీ సర్కార్ మూడేళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో గోరఖ్పూర్ లో నిర్వహించిన పార్టీ వార్షికోత్సవ కార్యక్రమంలో రాధామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొనగా.. ఓ మహిళ తన సమస్యలు చెప్పుకునేందుకు వచ్చింది. తమ ప్రాంతంలో సరైన వసతులు కల్పించాలంటూ ఆయన్ను అభ్యర్థించింది.
మహిళ వేడుకోలు పట్ల బాధ్యతాయుతంగా స్పందించాల్సిన ఎమ్మెల్యే రాధామోహన్ అసభ్యకర రీతిలో స్పందించారు. తొలుత నీకెంతమంది పిల్లలు? అని ప్రశ్నించారు. దీనికి ఇద్దరు పిల్లలు అని ఆమె బదులిచ్చింది. ఇద్దరు పిల్లలు ఒకేసారి పుట్టారా? అంటూ రాధామోహన్ తన నోటి దురుసును బయటపెట్టుకున్నారు.
ఇద్దరు పిల్లలను ఒకేసారి కనలేనప్పుడు.. సమస్యలు మాత్రం అన్ని ఒకేసారి ఎలా పరిష్కరమవుతాయని వెకిలిగా జవాబు ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఎమ్మెల్యే అయి ఉండి ఒక సామాన్య మహిళ సాధక బాధకాల పట్ల ఇలాగేనా స్పందించేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.ఇకనైనా ఎమ్మెల్యే రాధామోహన్ మహిళల పట్ల అసభ్యకర రీతిలో ప్రవర్తించడం మానుకోవాలన్న అభిప్రాయాలు అటు జనంలోను వ్యక్తమవుతున్నాయి.