ప్రేమోన్మాది దాడి: తనతో మాట్లాడలేదని... ఎమ్మెల్యే కూతురిపై కత్తితో...
ఓ ప్రేమోన్మాది ఏకంగా ఎమ్మెల్యే కూతురిపైనే దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఉదంతమిది.
పూణే: తనతో మాట్లాడటానికి అయిష్టత చూపిందన్న ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన ఓ ప్రేమోన్మాది ఏకంగా ఎమ్మెల్యే కూతురిపైనే దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఉదంతమిది. మహారాష్ట్రలోని పూణేలో ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... పూణేలోని ఓ కాలేజీలో అశ్విని బోడుకుర్వార్(22) ఎంబీయే చదువుతోంది. ఆమె తండ్రి సంజీవ్ రెడ్డి బోడుకుర్వార్ బీజేపీ ఎమ్మెల్యే. అశ్విని క్లాసులోనే హర్యానాకు చెందిన రాజేష్ బక్షి(23) కూడా చదువుతున్నాడు.
ఆర్నెల్లుగా వీరికి పరిచయం ఉంది. కొన్ని రోజులుగా రాజేష్.. అశ్విని వెంట పడుతున్నాడు. రోడ్డు మధ్యలో ఆపి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. అతడి వేధింపులు అధికం అవడంతో అశ్విని కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో యాజమాన్యం రాజేష్ ను తీవ్రంగా మందలించింది. ఇంకెప్పుడూ అశ్విని వెంటపడనని, మాట్లాడనని రాతపూర్వకంగా అతడి నుంచి రాయించుకుని వదిలేసింది.
కానీ రాజేష్ తన బుద్ధి మార్చుకోలేదు. అలా రాసిచ్చిన మర్నాడే మళ్లీ రాజేష్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కాలేజీకి వచ్చిన అశ్విని తన స్నేహితురాలితో కలిసి పక్కనే ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లింది.
అక్కడికి వెళ్లిన రాజేష్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆమె అతడితో మాట్లాడేందుకు అయిష్టత ప్రదర్శించడంతో విచక్షణ కోల్పోయిన రాజేష్ తీవ్ర ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న చాకుతో ఆమెపై దాడి చేశాడు. ఆమె ముఖంపై, చేతులపై గాయపరిచాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించే క్రమంలో అశ్విని చిటికెన వేలు తెగి పడిపోయింది. మరో మూడు వేళ్లు కోసుకుపోయాయి.
ఇది గమనించిన ఇద్దరు విద్యార్థులు వచ్చి రాజేష్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బలవంతంగా అతడి చేతిలోంచి కత్తిని లాగేసుకుని పారేశారు. అప్పటికే తీవ్రంగా రక్తస్రావం అవుతున్న అశ్వినిని ఆసుపత్రికి తరలించారు.
పోలీసులకు కూడా సమాచారం చేరవేసి, వారు అక్కడికి చేరుకోగానే రాజేష్ ను వారికి అప్పగించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అశ్విని తల్లిదండ్రులు తమ కుమార్తెను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం తమ బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు వారు మీడియాకు చెప్పారు.