పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై నిప్పులు చెరిగిన గౌతమ్ గంభీర్.. అతడో కీలుబొమ్మ అంటూ..
పాకిస్థాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్పై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నిప్పులు చెరిగారు. పాక్ ఆర్మీ చేతిలో ఆయన ఓ కీలుబొమ్మ అని గంభీర్ తీవ్రమైన విమర్శలు చేశారు. నాంకానా సాహిబ్ గురుద్వారా ఘటన నేపథ్యంలో గంభీర్ ఘాటుగా స్పందించారు. ఇంకా ఇమ్రాన్పై ఎలాంటి విమర్శలు చేశారంటే..

యూపీలో వివక్ష అంటూ ఇమ్రాన్ వీడియో
పాకిస్థాన్లో ఓ యువతిని బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించిన సంఘటనపై గంభీర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యూపీలో ముస్లింలపై వివక్ష కొనసాగుతుందనే విషయాన్ని చెబుతూ శుక్రవారం ఓ వీడియోను షేర్ చేయడం, ఆ తర్వాత వీడియో భారత్లో జరిగింది కాదని, ఆ ఘటన బంగ్లాదేశ్లో జరిగిందని తెలుసుకొని ఇమ్రాన్ ఖాన్ తన ట్వీట్ను డిలీట్ చేయడం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని గౌతమ్ గంభీర్ ఎండగట్టారు.

పాకిస్థాన్ తీరుకు నిదర్శనం
పాకిస్థాన్లో ఓ అమ్మాయిని బలవంతంగా మత మార్పిడి చేసేందుకు ప్రయత్నించడం, టూరిస్టులపై రాళ్లు రువ్వడం, వారి ప్రాణాలకు హానీ తలపెట్టడం దారుణం. మైనారిటీలపై పాకిస్థాన్ తీరుకు ఇది నిదర్శనం. అందుకే పౌరసత్వం సవరణ చట్టాన్ని భారత్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ చేతిలోని కీలుబొమ్మలు ఫేక్ వీడియోలు ట్వీట్స్ చేస్తూ ఫూల్స్గా మారుతున్నారు అని గంభీర్ ట్వీట్ చేశారు.

సిక్కు భక్తులపై రాళ్లదాడి
శుక్రవారం పాకిస్థాన్లోని నాంకానా సాహిబ్ గురుద్వారాపై ముస్లిం మతానికి చెందిన ఓ గ్రూప్ దాడి చేయడం తెలిసిందే. ఆ సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సిక్కు మతానికి చెందిన భక్తులు భయంతో గడిపడం సంచలనంగా మారింది. సిక్కు మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, గురుద్వారాపై రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

సిక్కులపై దాడి చేయించింది..
పాకిస్థాన్లో జగజ్జిత్ కౌర్ అనే సిక్కు యువతిని లోబరుచుకొని మహ్మద్ హసన్ అనే వ్యక్తి బలవంతంగా మత మార్పిడికి ప్రయత్నించడం వివాదంగా మారింది. మహ్మద్ హసన్ నేతృత్వంలోనే గురుద్వారాపై దాడి జరిగిందని పాకిస్థాన్కు చెందిన మీడియా వర్గాలు వెల్లడించాయి. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాక్ ప్రధానిపై గంభీర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications