బీహార్ ప్రచారానికి ఆ ఇద్దరినీ దూరం పెట్టిన బీజేపీ- కాషాయదళంలో ఒకటే చర్చ....
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ బీహార్ బీజేపీలో కీలకంగా ఉన్న ఇద్దరు జాతీయ స్ధాయి నేతలు, మాజీ కేంద్రమంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, షానవాజ్ హుస్సేన్లను ఈసారి ప్రచారానికి ఎంపిక చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు కల్పించలేదు.
1999లో తొలిసారి బీహార్ నుంచి ఎంపీలుగా గెలిచిన రాజీవ్ ప్రతాప్ రూడీ, షానవాజ్ హుస్సేన్ అప్పటి అటల్ బిహార్ వాజ్పేయ్ ప్రభుత్వంలో మంత్రులుగా కూడా చోటు సంపాదించారు. అప్పటి నుంచీ బీహార్లో బీజేపీ ప్రముఖ నేతల్లో ఒకరుగా వీరు పేరు తెచ్చుకున్నారు. బీజేపీ తరఫున ఈసారి ప్రచారంలో పాల్లొనాలని వీరు కూడా భావించారు. అయితే తాజాగా ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో వీరికి చోటు దక్కకపోవడంపై బీజేపీలో చర్చ జరుగుతోంది. వీరి తర్వాత 2014లో పార్టీలోకి వచ్చిన రామ్ క్రిపాల్ యాదవ్, సుశీల్ సింగ్, ఛేదీ పాశ్వాన్ వంటి వారికి సైతం ఈ జాబితాలో చోటు దక్కింది.
అయితే తమకు తొలి దశ ఎన్నికల ప్రచార జాబితాలో చోటు దక్కకపోవడంపై వీరు నిరాశకు లోనయినట్లు తెలుస్తోంది. ఇది తొలిదశ మాత్రమేనని, మిగతా రెండు దశలకు ప్రకటించే జాబితాపై ఆశావహంగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో షానవాజ్ హుస్సేన్ను ముస్లిం ఓట్లు ఎలాగో తమకు పడవన్న అంచనాకు వచ్చినందునే బీజేపీ పట్టించుకోలేదన్న ప్రచారం జరుగుతోంది.