మొన్న ఆరెస్సెస్, నిన్న బీజేపీ నేత .. చెట్టుకు ఉరేసిన ప్రత్యర్థులు ...
కోల్కత : బెంగాల్ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేకుండా పోయింది. టీఎంసీ, బీజేపీ నేతల మధ్య దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. మరోవైపు సోమవారం రోజు ఆరెస్సెస్కు చెందిన ఓ బీజేపీ కార్యకర్త చెట్టుకు ఉరేసిన ఘటన కలకలం రేపుతుంది.
బీజేపీ కార్యకర్త హత్య ?
హౌరాలోని సర్పోటా గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త సమతుల్ దోలుయి విగతజీవిగా కనిపించాడు. చెట్టుకు ఉరేసి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమ కార్యకర్తను హతమార్చి .. ఉరేసింది టీఎంసీ కార్యకర్తలేనని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. బీజేపీలో సమతుల్ చురుకుగా పనిచేసేవారు .. దీంతో అతనికి లోక్సభ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది పార్టీ హైకమాండ్.

దీంతో విజయవంతంగా పనిచేయడం .. బీజేపీ సీట్లు పెరగడంతో టీఎంసీ కోపగించుకున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అంతేకాదు మమత బెనర్జీ ర్యాలీలలో జై శ్రీరాం నినాదాలు చేయడంతో ఆ పార్టీ నేతలు రగిలిపోయారని పేర్కొన్నారు. అంతేకాదు ఎన్నికలు ముగిసిన వెంటనే సమతుల్ ఇంటిపై టీఎంసీ నేతలు దాడిచేసే ప్రయత్నం చేశారని బీజేపీ నేత అనుపమ్ మాలిక్ పేర్కొన్నారు.
ఆరెస్సెస్ నేత కూడా ..
అయితే కొందరు దుండగులు సమతుల మృతదేహం తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని .. స్థానికులు అడ్డుకోవడంతో పోస్టుమార్టం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. దీంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దించి .. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాదు ఆదివారం కూడా ఆరెస్సెస్ ప్రచారక్ సందేశ్ మన్నా కూడా అట్చాట గ్రామంలో ఉరేసి కనిపించిన సంగతి తెలిసిందే.
ఇతను కూడా ఇదివరకు జై శ్రీరాం పేరుతో ర్యాలీలు నిర్వహించారు. సందేశ్ను కూడా టీఎంసీ మద్దతుదారులు హతమార్చి ఉంటారని మాలిక్ ఆరోపించారు. ఈ రెండు హత్యలు ఒకేలా ఉండటంతో తమ అనుమానాలకు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. అయితే బీజేపీ ఆరోపణలను టీఎంసీ నేతలు తప్పుపడుతున్నారు. బీజేపీ నేతలు పసలేని వాదనలు చేస్తున్నారని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications