బలిదానాలు వద్దన్నా, ఘాతుకానికి పాల్పడ్తానా: సుష్మా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) పైన లోకసభలో చర్చ జరుగుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిల్లుకు ఆమోదం లభించాక కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలు సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని చెబుతారని కానీ, ఈ చిన్నమ్మ కూడా మద్దతిచ్చారని చెప్పాలని కోరారు. తెలంగాణ ప్రాంత యువకులకు విశ్వాస ఘాతుకం చేయలేకనే తాను మద్దతిచ్చామన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక సీమాంధ్రులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. తెలంగాణ బిల్లుకు తమ పార్టీ ఎప్పుడైనా మద్దతిస్తుందని తాము ఎన్నోసార్లు చెప్పామన్నాం. కాంగ్రెసు పార్టీ ఇవ్వకుంటే తామే ఇస్తామని చెప్పామని తెలిపారు. యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు తాను ఇదే స్థానం నుండి తెలంగాణ కోసం బలిదానాలు వద్దని, ప్రత్యేక రాష్ట్రాన్ని చూడటానికి జీవించాలని కోరానని, తెలంగాణ కోసం జీవించాలని చెప్పిన తానే విశ్వాసఘాతుకానికి ఎలా పాల్పడగలనన్నారు.
వారి సుదీర్ఘ కల నెరవేర్చేందుకు తాము బిల్లుకు ఎప్పుడైనా, ఎక్కడైనా మద్దతిస్తామన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు వాగ్ధానం చ్సిందని, ఇప్పుడు 15వ సభ ముగిసే సమయంలో తెచ్చారని విమర్శఇంచారు. సమస్యను లాగి ఇక్కడకు తీసుకొచ్చారన్నారు. సొంత పార్టీ ముఖ్యమంత్రిని, కేంద్రమంత్రులను, నేతలను ఒప్పించలేకపోయారన్నారు. మంత్రులే వెల్లోకి రావడం దురదృష్టకరమన్నారు.
తాము గతంలో మూడు రాష్ట్రాలు ఇచ్చినా ఏమీ కాలేదని, ఇప్పుడు తెలంగాణ విషయంలో కాంగ్రెసు ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిందన్నారు. అన్ని పార్టీలో తెలంగాణ, సీమాంధ్ర పార్టీల్లో విభేదాలు వచ్చినా తమ పార్టీలో అది లేదని, అందుకు తాను ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. హైదరాబాదుతో కూడిన ప్రత్యేక తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ ఇవ్వాలని, అదే సమయంలో సీమాంధ్రకు న్యాయం చేయాలన్నారు. జన చేతన యాత్రలో అద్వానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్నారు.