మరో బీజేపీ నేత దారుణ హత్య: టీఎంసీ గుండాల పనేనంటూ ఆరోపణలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. కూచ్ బేహర్ జిల్లాలో అతడ్ని కొట్టి చంపారు. ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ గుండాలు చేసిన హత్యేనని అతని కుటుంబసభ్యులు, బీజేపీ ఆరోపిస్తోంది.
బీజేపీ కార్యకర్త హత్య నేపథ్యంలో మృతదేహంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై ఆందోళనకు దిగారు.
గురువారంనాడు 12 గంటల బంద్కు బీజేపీ పిలుపినిచ్చింది. అయితే, తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తమకు ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదంటోంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుఫాగంజ్ ప్రాంతంలోని కళాచంద్ కర్మాకర్(50) షాపు ముందు కొందరు ఘర్షణకు దిగగా.. అతడు వారిని వారించారు.

అయితే, కర్మాకర్పై దాడి చేసిన దుండగులు దారుణంగా కొట్టడంతో కుప్పకూలిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కర్మాకర్ హత్య కేసులు ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పలువురు బీజేపీ నేతలు హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. తృణమూల్ గుండాలే కర్మాకర్ను హత్య చేశారని, నిందితులకు మమతా బెనర్జీ సర్కారు అండగా ఉంటోందని కేంద్రమంత్రి బాబుల్ సుప్రీయో ఆరోపించారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దురాహంకార ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారన్నారు.
కాగా, తమపై వస్తున్న ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ నేతుల కొట్టిపారేస్తున్నారు. బీజేపీ రాజకీయాలు చేస్తోందంటూ టీఎంసీ నేత రబీంద్రనాథ్ ఘోష్ అన్నారు. కరోనా చనిపోయినా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మరో టీఎంసీ నేత సుఖేంద్ శేఖర్ అన్నారు. కూచ్ బేహర్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ పట్టుకోల్పోతుండటంతో బీజేపీ నేతల హత్యలకు కూడా టీఎంసీ వెనకాడటం లేదని బీజేపీ నేత సౌరవ్ దాస్ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications