బ్లాక్ మనీ కేసు: పేర్లు చెప్పమని నరేంద్రమోడీ ప్రభుత్వం
న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచుకున్న కుబేరుల జాబితాను వెల్లడించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దానిపై ఈ నెల 28న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.
కేంద్రం పిటిషన్ పైన ప్రముఖ న్యాయవాది, నల్ల కుబేరుల జాబితా వెల్లడి కోసం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన రాం జెత్మలానీ మండిపడ్డారు. నల్ల కుబేరులను నరేంద్ర మోడీ ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు. కేంద్రం పిటిషన్ నేరచరితులను బలపరిచేదిగానే ఉందన్నారు.
కాగా, నల్లధనంపై ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. భారత్ కోరుతున్న విధంగా సమాచారం అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే.
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లకు సంబంధించి భారత ప్రభుత్వం అభ్యర్థనలను ప్రాధాన్యతాక్రమంలో పరిశీలిస్తామని, వివరాలను నిర్ణీత కాలవ్యవధిలో అందజేస్తామని హామీ ఇచ్చింది. భారత ఆర్థిక కార్యదర్శి శక్తికాంతదాస్, స్విట్లర్లాండ్ విదేశీ ఆర్థిక వ్యవహారాల మంత్రి జాక్వెస్ డి వాటెవిల్లె మధ్య బెర్న్లో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది.
ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. స్విస్ నేషనల్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం 2013 సంవత్సరాంతానికి అక్కడి బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు రూ. 14వేల కోట్లకు చేరుకుంది.