సీఎంతో పాటు స్టార్ హీరోలకు బాంబు బెదిరింపులు: ఒక్కసారిగా హై అలర్ట్!
Bomb Threats: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సినీ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసాలకు బాంబు బెదిరింపులు రావడంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి ఈ నలుగురు ప్రముఖుల ఇళ్లలో బాంబులు పెట్టినట్లు హెచ్చరిస్తూ పోలీసులకు ఓ ఈ-మెయిల్ అందింది. డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపు సందేశం ఈ-మెయిల్ రూపంలో వచ్చింది. ఈ సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తమై.. సీఎం స్టాలిన్ నివాసంతో సహా నలుగురు ప్రముఖుల నివాసాల వద్ద భద్రతను వెంటనే కట్టుదిట్టం చేశారు.
పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు కలిసి ఇళ్ల లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలు కొన్ని గంటల పాటు కొనసాగాయి. విస్తృత తనిఖీల అనంతరం, అధికారులు ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులను కనుగొనలేదు. దీంతో ఈ ఈ-మెయిల్ నకిలీ బెదిరింపు అని నిర్ధారించారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ ఈమెయిల్ పంపిన మూలాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వరుస బెదిరింపుల కలకలం
తమిళనాడులో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు రావడం ఇటీవల కాలంలో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది: చెన్నై, ఇంజంబక్కంలోని అజిత్ కుమార్ నివాసానికి కేవలం వారం రోజుల క్రితం కూడా గుర్తుతెలియని వ్యక్తి నుండి ఇదే తరహా బెదిరింపు వచ్చింది.ఇటీవల నటుడు అరుణ్ విజయ్ ఇంటికి కూడా ఇలాంటి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది, అది కూడా నకిలీదని తేలింది. గత నెలలో కూడా సీఎం స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. అంతకుముందు బీజేపీ ప్రధాన కార్యాలయం, నటి త్రిష నివాసాలకు కూడా ఇలాంటి నకిలీ హెచ్చరికలు వచ్చాయి.పోలీసులు ఈ వరుస ఫేక్ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications