బురఖా వేసుకోలేదని అలా చేస్తారా!.. గుండె తరుక్కుపోయే క్రైమ్ స్టోరీ!!
ఉత్తరప్రదేశ్లోని శామ్లీ జిల్లాలో మానవత్వం మంటగలిసిపోయే అత్యంత కిరాతక ఘటన వెలుగుచూసింది. కేవలం భార్య బురఖా లేకుండా పుట్టింటికి వెళ్లిందన్న చిన్న కారణంతో ఓ కసాయి భర్త తన భార్యను, ఇద్దరు కన్నకూతుళ్లను దారుణంగా హత్య చేశాడు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఇంటిలోనే 9 అడుగుల లోతైన గోతిని తవ్వి వారిని పాతిపెట్టాడు.
నమ్మశక్యం కాని ఈ దారుణ ఘటన శామ్లీ జిల్లాలోని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గర్హీదౌలత్ గ్రామంలో చోటుచేసుకుంది. ఫరూక్ అనే వ్యక్తి తన భార్య తాహిరా (32), కుమార్తెలు ఆఫ్రీన్ (12), సారిన్ (5)లను హత్య చేసి ఆరు రోజుల పాటు ఏమీ తెలియనట్లు నాటకమాడాడు. పోలీసుల విచారణలో నిందితుడు ఫరూక్ చెప్పిన విషయాలు విని అధికారులు సైతం షాక్కు గురయ్యారు.

ఈ దారుణానికి గల కారణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన భార్య తాహిరా బురఖా ధరించకుండా తన పుట్టింటికి వెళ్ళిందని ఫరూక్ కోపంతో ఊగిపోయాడు. డిసెంబర్ 10వ తేదీ రాత్రి భార్య వంట గదిలో ఆహారం వండుతుండగా.. ఫరూక్ ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. కాల్పుల శబ్ధం విని ఇద్దరు కూతుళ్లు నిద్రలేచి బయటకు రాగా.. పెద్ద కూతురు ఆఫ్రీన్ను కూడా కాల్చి చంపేశాడు. చిన్న కూతురు సారిన్ను గొంతు నులిమి చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటిలోనే 9 అడుగుల గొయ్యి తవ్వి, ముగ్గురి మృతదేహాలను అందులో వేసి పూడ్చిపెట్టాడు.
గుట్టు రట్టు అయ్యిందిలా..
గత 6 రోజులుగా భార్యాబిడ్డలు కనిపించకపోవడంతో ఫరూక్ తండ్రికి అనుమానం వచ్చి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్ద కూడా మహిళ, పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు ఫరూక్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు ఫరూక్ ఇంటిలో తవ్వకాలు జరిపి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నిందితుడిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications