ట్రైన్ టికెట్లు EMI పద్ధతిలో చెల్లించండి!
ఐఆర్సీటీసీలోనూ (IRCTC) ఈఎంఐ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ కామర్స్ సైట్లలో, వివిధ దుకాణాల్లో ఒక వస్తువును కొనుగోలు చేసి వాటి ధరలను ఎలాగైతే ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తున్నామో ఇకపై ట్రైన్ టికెట్లూ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయొచ్చు.
దీనికోసం ఐఆర్ సీటీసీ 'ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి' పేరుతో సేవలను ప్రారంభించింది. దీనికోసం క్యాష్ఈ (CASHe) సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రైల్వేకు చెందిన ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్లో ఈ సేవలు లభ్యమవుతాయి.

6 లేక 8 నెలలు: ప్రయాణికులు ఇకనుంచి టికెట్ కొనుగోలు చేసిన తర్వాత టికెట్ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో చెల్లించొచ్చు. 6 లేదా 8 వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు ఉంది. సాధారణ, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో క్యాష్ఈ ఈఎంఐ సేవలను అందరూ పొందొచ్చు.
యాప్ వాడే వారంతా ఆటోమేటిక్గా ఈ సదుపాయాన్ని పొందుతారని, దీనికి ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదని క్యాష్ఈ సంస్థ తెలిపింది. ముందుగా కొంత చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకోవడం లేదంటే టికెట్ ధర మొత్తాన్నీ ఈఎంఐగా మార్చుకోవచ్చు. కాలవ్యవధి ఆధారంగా వడ్డీ రేటు వర్తిస్తుంది.
టికెట్ బదిలీ: ఒకవేళ ప్రయాణం రద్దు చేసుకుంటే ఆ టికెట్ ను ఎవరో ఒకరు కుటుంబ సభ్యుల పేర్లమీదకు మార్చవచ్చు. టికెట్ కన్ఫర్మ్ అయినవారికే ఈ వెసులుబాటు ఉంటుంది. ఎవరిపేరు మీదకు టికెట్ ను బదిలీ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డు లేదంటే ఓటరు గుర్తింపుకార్డు కలిగివుండాలి.
దగ్గరలోని రైల్వేస్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లి బదిలీ చేయమని కోరుతూ అర్జీ ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులైతే 24 గంటల ముందు, పెళ్లి, ఇతర వ్యక్తిగత పనులపై వెళ్లేవారు 48 గంటల ముందుగా తమ టికెట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications