తెలుగు రాష్ట్రాల రైల్వేలకు మహర్దశ.. 20 వేల కోట్లతో 8 భారీ ప్రాజెక్టులు!
భారతదేశ రవాణా రంగానికి వెన్నెముకగా నిలిచే రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ.20,804 కోట్ల అంచనా వ్యయంతో 8 అత్యంత కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న రైల్వే ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా అత్యధిక రద్దీ ఉండే కారిడార్లలో కొత్త రైలు మార్గాలు, త్రిబుల్, క్వాడ్రపుల్ (నాలుగు) ట్రాక్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రయాణికుల నిరీక్షణ సమయం తగ్గడమే కాకుండా, సరుకు రవాణా రంగంలో ఊహించని వేగం పుంజుకోనుంది.
దక్షిణాదికి రూ.10,021 కోట్లు.. ఎవరెవరికి ఏంటి లబ్ధి?
ఈ కేబినెట్ నిర్ణయంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలకు పెద్దపీట వేశారు. దక్షిణాది కోసం దాదాపు రూ.10,021 కోట్లతో 5 ముఖ్యమైన ప్రాజెక్టులను ఖరారు చేశారు. దీనిద్వారా దాదాపు 540 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్లు అందుబాటులోకి రానున్నాయి. 17 జిల్లాల్లోని 2,121 గ్రామాలకు చెందిన 52 లక్షల మంది ప్రజలకు ఇది ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చనుంది.

- అరక్కోణం - రేణిగుంట (3వ, 4వ లైన్లు): 77 కిలోమీటర్ల మేర లైన్ల విస్తరణతో రాయలసీమకు చెన్నై కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది.
- సికింద్రాబాద్ (ఘట్కేసర్) - కాజీపేట (మల్టీట్రాకింగ్): 110 కిలోమీటర్ల మేర ట్రాక్ల సంఖ్య పెంపుతో హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ, విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు ఊరట లభించనుంది.
- వైట్ఫీల్డ్ - బంగారపేట (3వ, 4వ లైన్లు): 47 కిలోమీటర్ల మేర రద్దీని తగ్గించే లైన్లు.
- హోసూరు - ఓమలూరు రెట్టింపు (డబ్లింగ్): 147 కిలోమీటర్ల విస్తరణ.
- సేలం - కరూర్ - దిండిగల్ రెట్టింపు (డబ్లింగ్): 159 కిలోమీటర్ల మేర ట్రాక్ల డబ్లింగ్.
తూర్పు ప్రాంతానికి రూ.10,783 కోట్లు.. 656 కిలోమీటర్ల కొత్త ట్రాక్లు!
మరో వైపు వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలుపుతూ రూ.10,783 కోట్ల అంచనా వ్యయంతో 3 భారీ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. ఇవి ఖరగ్పూర్ - ఝార్సుగూడ (బగ్దేహి) 4వ లైన్, కట్నీ - పెండ్రా రోడ్ 4వ లైన్, బిలాస్పూర్ - పెండ్రా రోడ్ 3వ లైన్లను కవర్ చేస్తాయి. మొత్తం 14 జిల్లాల్లో విస్తరించి ఉన్న 656 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 4,790 గ్రామాలు, 56 లక్షల జనాభాకు ఆధునిక రైల్వే సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
🚉 These projects include:
— PIB India (@PIB_India) September 9, 2026
➤ Arakkonam – Renigunta 3rd and 4th Line – 77 kms
➤ Whitefield – Bangarapet 3rd and 4th Line – 47 kms
➤ Hosur – Omalur Doubling – 147 kms
➤ Salem – Karur – Dindigul Doubling – 159 kms
➤ Multitracking of Secunderabad (Ghatkesar) – Kazipet – 110 kms… pic.twitter.com/p0AG5ofj5v
ఆధ్యాత్మిక నిలయాలకు అతుకులు లేని కనెక్టివిటీ!
'పీఎం-గతి శక్తి' జాతీయ మాస్టర్ ప్లాన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టులు దేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని గణనీయంగా పెంచనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి గుడి, యాదగిరిగుట్ట, భోంగీర్ కోట, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, హొగేనక్కల్ జలపాతం, కొడైకెనాల్ కొండలు మరియు సత్యమంగళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం ఇకపై ఎంతో తేలిక కానుంది.
ఆర్థిక వ్యవస్థకు బూస్టర్.. పర్యావరణానికి మహోపకారం!
బగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయన ఎరువులు, ఆటోమొబైల్స్ మరియు ఆహార ధాన్యాల రవాణాకు ఈ కారిడార్లు అత్యంత కీలకమైనవి. ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల ఏటా అదనంగా 74 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. రవాణా వ్యయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ఇంధన వినియోగం తగ్గి దేశానికి దాదాపు 20 కోట్ల లీటర్ల ముడి చమురు దిగుమతులు ఆదా కానున్నాయి. అంతేకాకుండా, గాలిలోకి విడుదలయ్యే దాదాపు 104 కోట్ల కిలోల కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలు తగ్గుతాయి. ఇది దాదాపు 4.48 కోట్లకు పైగా చెట్లను నాటడంతో సమానమని అధికారులు పేర్కొంటున్నారు.













Click it and Unblock the Notifications
