మళ్లీ తెరపైకి ట్రిపుల్ తలాక్పై బిల్లు? ఈసారైనా గట్టెక్కేనా?
ట్రిపుల్ తలాక్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బుధవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ట్రిపుల్ తలాక్కు సంబంధించి మళ్లీ కొత్త బిల్లు తీసుకు వచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముమ్మారు తలాక్ కారణంగా ముస్లిం మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్డీయే సర్కారు గత లోక్సభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి లోక్సభ ఆమోదం తెలపగా.. విపక్షాల అభ్యంతరాలతో రాజ్యసభలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడక ముందే 16వ లోక్సభ రద్దైంది.
రాహుల్ రాజీనామాపై తొలగని సస్పెన్స్.. నేడు మరోసారి భేటీ కానున్న కాంగ్రెస్ కోర్ గ్రూప్..
16వ లోక్సభ రద్దుతో మళ్లీ బిల్లు
నిబంధనల ప్రకారం లోక్సభ రద్దైతే ఉభయ సభల ఆమోదం పొందని బిల్లులకు కాలదోషం పడుతుంది. ఒకవేళ బిల్లు లోక్సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్లో ఉన్నా లోక్సభ రద్దైన పక్షంలో ఆ బిల్లులు కూడా వాటంతట అవే రద్దయి పోతాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్ర కేబినెట్ మళ్లీ ఆమోదం తెలిపి లోక్సభలో ప్రవేశపెట్టాలని మోడీ సర్కారు భావిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం
ముస్లిం మహిళలకు విడాకుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై స్పందించిన ఎన్డీఏ ప్రభుత్వం గతేడాది ట్రిపుల్ తలాక్ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. 2018 సెప్టెంబర్ దానికి లోక్సభ ఆమోదం తెలిపినా.. ప్రతిపక్షాల అభ్యంతరాలతో రాజ్యసభ ఆమోద ముద్ర వేయించు కోలేకపోయింది. కేంద్రం ముస్లిం ఉమెన్ ఆర్డినెన్స్ 2019ను తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత్లో ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్దం. దాన్ని అతిక్రమించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్లో నిబంధనలు విధించారు.
45రోజుల్లో చట్టరూపం?
జూన్ 17 నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సెషన్ ప్రారంభమైన 45 రోజుల్లోగా ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్కు కాలం చెల్లనుంది. ఈ క్రమంలో కేంద్రం ఆలోపే ముస్లిం ఉమెన్ ఆర్డినెన్స్ 2019కు చట్టరూపం ఇవ్వాలని భావిస్తోంది. ఈ కారణంగానే కేంద్ర మంత్రివర్గ తొలి భేటీలోనే ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదం పొంది మళ్లీ లోక్సభలో ప్రవేశపెట్టాలని మోడీ సర్కారు నిర్ణయించినట్లు సమాచారం.