తప్పును అంగీకరించిన సీబీఎస్ఈ, ఆ ప్రశ్న తొలగింపు, విద్యార్థులకు మార్కులు: సోనియా నిరసన
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంలో మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా పలు అంశాలున్నాయంటూ పార్లమెంటులో కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిపుణుల సిఫార్సు మేరకు అభ్యంతరకరమైన ప్రశ్నను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఆ ప్రశ్నకు మార్కులు విద్యారలందరికీ ఇస్తున్నామని పేర్కొంది.
ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్యాసేజీ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదంటూ కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ అంశాన్ని విషయ నిపుణుల పరిశీలనకు పంపామని, వారి సిఫార్సుల మేరకు ప్యాసేజీ 1తోపాటు అనుబంధంగా ఇచ్చిన ప్రశ్నలను తొలగించాలని నిర్ణయించినట్లు సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
ఆ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులందరికీ పూర్తి మార్కులు ఇస్తామని సీబీఎస్ఈ ప్రకటిచించింది. ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలోని ప్యాసేజ్ 1కు సంబంధం కేవలం జేఎస్కే/1 సిరీస్ ప్రశ్నాపత్రం వచ్చివారికే కాకుండా అన్ని సిరీస్లవారికి పూర్తి మార్కులు కేటాయిస్తామని స్పష్టం చేసింది.
కాగా, సీబీఎస్ఈ పదో తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఓ కాంప్రహెన్సన్ ప్యాసేజీలో పలు అంశాలు మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మహిళా విమోచనం వల్ల పిల్లలపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు దెబ్బతింటున్నాయి. భర్త అడుగుజాడల్లో నడవడం ద్వారానే ఒక తల్లి తన పిల్లల నుంచి విధేయత వంటివాటిని పొందగలుగుతుంది వంటి అంశాలున్నాయి. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్లమెంటులోనూ చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
ఈ ప్రశ్నాపత్రం అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్ సభలో లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయానికి నిరసనగా డీఎంకే, ఎన్సీపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ తాజా నిర్ణయం ప్రకటించి వివాదానికి ముగింపు పలికింది.