తీవ్ర పరిణామాలుంటాయ్- సుప్రీంకోర్టుకు కేంద్రం కీలక సూచన
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాలని, దీనికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. పలు పిటీషన్లు దాఖలయ్యాయి. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇదివరకే విచారణ చేపట్టింది.
స్వలింగ వివాహాల గుర్తింపు కోసం వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. జనవరి 6వ తేదీన వాటన్నింటినీ తమకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకుండా గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులను జారీ చేసింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇదివరకే తన అభిప్రాయాన్ని వెల్లడించింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేసింది. దీనికి చట్టబద్ధతను కల్పించడం, అధికారికంగా గుర్తింపును ఇవ్వడం సరికాదని తేల్చి చెప్పింది. ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం- స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడం నేరమని తెలిపింది. స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో లేదని వివరించింది.
ఈ పిటీషన్లపై విచారణను అయిదు మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించనుంది.
మంగళవారం నుంచి ఈ రాజ్యాంగ ధర్మాసనం ఆయా పిటీషన్లపై విచారణను మొదలు పెట్టనుంది. ఈ నేపథ్యంలో- తాజాగా మరోసారి కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ను దాఖలు చేసింది. అయిదు మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కావడం వల్ల తన నిర్ణయాన్ని ఈ ధర్మాసనానికి వెల్లడించింది. వివాహం అనేది కుటుంబపరమైన అంశమని, అది సమాజంపైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది.
ఈ విషయంలో చట్టానికి లోబడి నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొంది. స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపును ఇవ్వడం వల్ల సమాజంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అభిప్రాయపడింది. ఈ తరహా వివాహాలకు మెజారిటీ ప్రజలు ఆమోదించరని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారు దీన్ని అంగీకరించరని తెలిపింది. చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లన్నీ కొంతమంది అభిప్రాయాలను ప్రతిబింబిస్తోన్నాయని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications