రా చీఫ్ గా మోదీ బెస్ట్ ఛాయిస్
ఆపరేషన్ సింధూర్.. కోట్లాదిమంది భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్తాన్ పై ప్రతీకార దాడులను చేపట్టడానికి భారత్ చేపట్టిన అత్యంత ప్రతిష్ఠత్మక మిషన్ ఇది. పాకిస్తాన్ ను గడగడలాడించిందీ ఆపరేషన్. ఆ దేశంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో వేళ్లూనుకుపోయిన ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేసింది.
అత్యంత కీలకమైన ఆపరేషన్ సింధూర్ ప్రాణం పోసిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. పరాగ్ జైన్. 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ కు చెందిన అధికారి. పాకిస్తాన్ ఆనుపానులు సమగ్రంగా తెలిసాయనకు. అందుకే- ఎప్పుడు? ఎలా పాకిస్తాన్ పై దాడులు చేయాలనే విషయంపై రక్షణ మంత్రిత్వ శాఖకు దిశానిర్దేశం చేశారు.

ఆపరేషన్ సింధూర్ కు కర్త- కర్మ- క్రియగా వ్యవహరించారు. అలాంటి సీనియర్ ఐపీఎస్ అధికారిని రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ కు అధిపతిగా నియమించింది కేంద్ర ప్రభుత్వం. భారత గూఢచర్య విభాగం ఇది. పాకిస్తాన్, చైనా సహా వివిధ దేశాల్లో రా నెట్ వర్క్ విస్తరించి ఉంది.
దీనికి పరాగ్ జైన్ రా చీఫ్గా నియమితులయ్యారు. ఈ హోదాలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. పరాగ్ జైన్ ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ గా ఉన్నారు. పాకిస్తాన్ వ్యవహారాల నిపుణుడిగా ఆయనకు పేరుంది. జూన్ 30న పదవీ విరమణ చేయనున్న రవి సిన్హా స్థానంలో పరాగ్ జైన్ బాధ్యతలు స్వీకరిస్తారు.
ఆయన గతంలో చండీగఢ్ ఎస్ఎస్పీగా పనిచేశారు. కెనడా, శ్రీలంకల్లో భారత ప్రతినిధిగా సేవలు అందించారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఆయన పనిచేశారు. అక్కడ ఉగ్రవాద నిరోధక వ్యూహాల్లో ప్రధాన పాత్ర పోషించారు. నేరుగా ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షించే విభాగం ఇది. ప్రధాని, జాతీయ భద్రత సలహాదారుకు మాత్రమే రిపోర్ట్ చేసే అధికారాలు రా చీఫ్ కు ఉన్నాయి.
రా సంస్థ 1968 సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పాటైంది. భారత్ కు వ్యతిరేకంగా విదేశాల్లో కుట్రలు జరుగుతున్నాయేమో తెలుసుకోవడం, రహస్య మిషన్లను పూర్తి చేయడం రా ప్రధాన లక్ష్యాలు. పరాగ్ జైన్ నియామకం రా సంస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఆయన అనుభవం, సామర్థ్యం.. ఈ విభాగం నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications