ఒక్కదానికి 15మంది పోటీయా? ఛత్తీస్ గఢ్ రెండో దశ పోలింగ్ పై ఉత్కంఠ..!
ఛత్తీస్ గఢ్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంగళవారం జరగనున్న రెండో దశ పోలింగ్ లో 72 అసెంబ్లీ స్థానాలకు గాను 1101 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అంటే ఒక్కో స్థానానికి సగటున 15 మంది పోటీపడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, అజిత్ జోగి పార్టీ (జేసీసీ) అభ్యర్థులతో పాటు ఇతరులు పెద్ద సంఖ్యలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాయ్ పూర్ వెస్ట్ నియోజకవర్గానికి అత్యధిక సంఖ్యలో 46 మంటి పోటీ పడుతుండటం గమనార్హం.
మర్వాహి నియోజకవర్గం నుంచి జేసీసీ అధినేత అజిత్ జోగి పోటీ చేస్తుండగా, కోట నుంచి ఆయన సతీమణి ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన కోడలు రిచా బీఎస్పీ తరపున అకల్ తారా స్థానం నుంచి పోటీ పడుతున్నారు.
ఛత్తీస్ గఢ్ లో 90 స్థానాలకు గాను నక్సల్స్ ప్రాబల్యమున్న 18 స్థానాలకు ఈనెల 12న తొలిదశ పోలింగ్ జరిగింది. 190 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఈ రెండు దశల పోలింగ్ కు సంబంధించిన ఫలితాలు మాత్రం వచ్చే నెల 11న వెలువడుతాయి.